Begin typing your search above and press return to search.

నా కోసం లాలూ దెయ్యాల్ని వదిలి వెళ్లారంటూ నితీశ్ ఆసక్తికర వ్యాఖ్య

By:  Tupaki Desk   |   3 Jan 2020 12:02 PM IST
నా కోసం లాలూ దెయ్యాల్ని వదిలి వెళ్లారంటూ నితీశ్ ఆసక్తికర వ్యాఖ్య
X
దేవుడు.. దెయ్యాలు లాంటి వాటిని బలంగా నమ్మే నేతగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను చెప్పాలి. అదే సమయంలో అలాంటి నమ్మకాలు.. పట్టింపులు లేని నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను చెబుతారు. అలాంటి నితీశ్ నోటి వెంట దెయ్యాల మాట రావటం ఒక ఆసక్తి కరమైతే.. వాటిని తన కోసం మాజీ సీఎం లాలూనే విడిచి వెళ్లారంటూ సరదాగా చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో.. ఎప్పుడూ లేని రీతిలో కొన్ని అంశాల్ని సీఎం నితీశ్ ప్రస్తావించారు. 2005లో ఆర్జేడీ తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత అప్పటివరకూ లాలూ కుటుంబం నివాసంగా ఉన్న 1, అన్నే మార్గ్ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ింటి వెనుక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టి కుప్పలు కనిపించినట్లు చెప్పారు.

ఇంటి చుట్టూ కొన్ని కాగితాలు.. కవర్లు కనిపించాయన్నారు. నీ కోసంకొన్ని దెయ్యాల్ని ఆ ఇంట్లో వదిలి వచ్చానని తనతో లాలూ సరదా గా అన్న వ్యాఖ్యల్ని నితీశ్ కుమార్ గుర్తు చేయటం విశేషం. ఆ మాటల్ని లాలూ తనదైన చమత్కార ధోరణిలో చెప్పినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. లాలూ కు నష్టం వాటిల్లేలా చేయటం కోసం నితీశ్ కుమార్ పట్నాలోని కాళీమాత ఆలయం లో ప్రత్యేక పూజలు చేయించారని తాజా ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానంద తివారీ పేర్కొన్నారు. అంతేకాదు.. నితీశ్ చేసిన పూజల ప్రభావం తన మీద ఉండకుండా ఉండేందుకు వీలుగా లాలూ మరికొన్ని పూజలు చేయించారని తివారీ పేర్కొన్నారు. ఈ వేళలోనే.. నితీశ్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య రావటం గమనార్హం.