Begin typing your search above and press return to search.

మోడీకి స‌పోర్ట్ ఓకే కానీ..మా నేత కూడా ప్ర‌ధాని కావాల్సిందే

By:  Tupaki Desk   |   6 Jan 2019 8:00 PM IST
సెమీఫైన‌ల్స్ అనే పేరున్న ఐదు రాష్ట్రలు ఎన్నిక‌లు ముగిసి లోక్‌ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాని పదవికి పోటీ పడేవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే తరఫున వచ్చే ఎన్నికల్లోనూ మోడీయే ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోడీయే తమ నాయకుడని బీజేపీ స్పష్టం చేసింది. అయితే ఎన్డీయేలోనే ఉన్న మిత్ర పక్షాల నుంచి కూడా ప్రధాని పదవి ఆశించే వాళ్లు బయటకు వస్తున్నారు. తాజాగా బీహార్‌ లోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీష్ కుమార్ కూడా ఈ రేసులో ఉన్నట్లు ఆ పార్టీ చెప్పుకుంది. ప్రధానిగా మోడీకి తమ మద్దతు ఉంటుంది కానీ.. తమ అధినేత కూడా ప్రధాని అభ్యర్థే అని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ చెప్పడం గమనార్హం. ఎన్డీయే ప్రధాని అభ్యర్థి మోడీయే అయినా.. దీనిపై చర్చ జరిగితే మాత్రం నితీష్ కూడా ముందు వరుసలో ఉంటారు అని ఆయన స్పష్టం చేశారు.

అయితే ప్రధాని అభ్యర్థిత్వం పై అసలు చర్చ ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెప్పింది. బీహార్‌ లోనూ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయే. నితీష్ కుమారే మోడీ పేరును ప్రతిపాదించారు. బీహార్ ప్రజలు కూడా దీనికి ఆమోదం తెలిపారు. అందువల్ల బీహార్‌ లో ప్రధాని అభ్యర్తిత్వం పై అసలు చర్చ ప్రసక్తే లేదు అని బీజేపీ ఎంపీ సీపీ ఠాకూర్ అన్నారు.

ఇదిలాఉండ‌గా, ఇటీవ‌లే బీహార్‌ లో వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం బీజేపీ, జేడీయూ మ‌ధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీలు స‌గం స‌గం సీట్లు పంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు సీఎం నితీశ్ కుమార్‌, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఓ ప్ర‌క‌ట‌న చేశారు. బీహార్‌ లో మొత్తం 40 పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ, జేడీయూ పార్టీలు చెరి 16 సీట్ల‌లో పోటీ చేయ‌నున్నాయి. మిగ‌తా 8 సీట్ల‌ను కూట‌మి పార్టీల‌కు ఇవ్వ‌నున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీకి 5 సీట్లు ద‌క్కనున్నాయి.