Begin typing your search above and press return to search.

నిర్భయ పిశాచికి భార్యగా ఉండలేను.. విడాకులు ఇవ్వమంటోంది

By:  Tupaki Desk   |   18 March 2020 6:15 AM GMT
నిర్భయ పిశాచికి భార్యగా ఉండలేను.. విడాకులు ఇవ్వమంటోంది
X
చట్టంలోని లొసుగులు.. న్యాయస్థానం తమకు విధించిన ఉరిశిక్ష అమలు మరింతకాలం కాలయాపన జరిగేలా ఉండేందుకు.. అవకాశం వస్తే.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న నిర్భయ దోషుల గురించి తెలిసిందే. ఉరిశిక్ష విధించి ఎంతో కాలమైనా.. ఏదో ఒక పిటిషన్ తో తమకు విధించిన ఉరి అమలు కాకుండా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఉరిశిక్ష అమలు కాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారు.. ఇటీవల అంతర్జాతీయ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.

ఇలాంటివేళ.. ఉరిశిక్షకు గురైన నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ సతీమణి తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం (2012)లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతంలో దోషిగా తేలారు.
తన భర్త నిర్దోషి అన్న మాటను చెబుతున్న ఆమె.. హత్యాచారం కేసులో దోషిగా న్యాయస్థానం తేల్చిందని.. అతనికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యం లో.. అలాంటి రేపిస్టుకు భార్యగా తాను జీవించలేనని పేర్కొంది. మరణశిక్ష అమలు తర్వాత వితంతువుగా జీవించలేనని.. అందుకే తనకు విడాకులు ఇవ్వాలని కోరింది.

ఈ పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది. ఇప్పటివరకూ కోర్టు విధించిన ఉరిశిక్ష అమలు చేసిన పక్షంలో ఈ నెల 20న నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉంది. అంటే.. ఉరిశిక్ష అమలుకు ఒక రోజు ముందు విడాకుల కేసును కోర్టు విచారించనుంది. మరి.. నిర్భయ దోషి భార్య కోరినట్లే.. ఆమెకు విడాకుల్ని కోర్టు మంజూరు చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.