Begin typing your search above and press return to search.

తిరుమల శ్రీవారు ఢిల్లీ వెళ్తున్నారు

By:  Tupaki Desk   |   27 Oct 2015 1:25 PM IST
తిరుమల శ్రీవారు ఢిల్లీ వెళ్తున్నారు
X
తిరుమల వెంకన్న త్వరలో దేశ రాజధాని ఢిల్లీ ప్రయాణమవుతున్నారట. ఈ నెల 31 నుంచి పది రోజుల పాటు తిరుమల శ్రీవారు దేశ రాజధాని ఢిల్లీలో కొలువుదీరి పూజలందుకుంటారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఈ నెల 31 నుంచి పది రోజుల పాటు శ్రీవారి ప్రార్థనాస్థలంగా మారనుంది. ఇక్కడ పది రోజుల పాటు కొలువుండే వెంకన్నకు తిరుమలలో స్వామివారికి జరిగే అన్ని సేవలూ ఇక్కడ నిర్వహిస్తారు.నవంబర్ 8 వరకూ ఇక్కడ తిరుమల తిరుపతి దేవదేవుడికి తిరుమలలో జరిగే విధంగానే నిత్య పూజలు జరుగుతాయి.

కాగా స్వామివారికి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట సేవలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక్కడ తిరుమలను పోలి ఉండేలా దేవాలయాన్ని కూడా తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర వైభోగం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం కోసం పూజారులు సహా 160 మంది తిరుమల నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. తిరుమలలో జరిగే అన్ని సేవలూ అక్కడ నిర్వహించనుండడంతో ఢిల్లీలోని భక్తులు వెంకన్న రాక కోసం నిరీక్షిస్తున్నారు.