Begin typing your search above and press return to search.

సచివాలయాలు, వలంటీర్లకు షాకిచ్చిన నిమ్మగడ్డ

By:  Tupaki Desk   |   26 Jan 2021 2:00 PM IST
సచివాలయాలు, వలంటీర్లకు షాకిచ్చిన నిమ్మగడ్డ
X
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే 9మంది వరకు ఉన్నతాధికారులను బదిలీ చేసిన నిమ్మగడ్డ తాజాగా గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీర్లకు కీలక ఆదేశాలిచ్చారు.

పంచాయితీ ఎన్నికల విధులకు గ్రామ వలంటీర్లు,సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. వలంటీర్లుగా ఉన్న ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను తిరిగి ఇచ్చేయాలని.. అలాగే వలంటీర్లందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందికి పైగా గ్రామ వలంటీర్లు, 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంతకాలం ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఎస్ఈసీ తెలిపారు.

సుప్రీం తీర్పు రాగానే ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ సోమవారం పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లపై బదిలీ వేటు వేశారు. ఎస్ఈసీ ఆదేశానుసారం ఏపీ ప్రభుత్వం నిన్న ఇద్దరినీ బదిలీ చేసేసింది. ఇక గుంటూరు , చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ సహా డీఎస్పీలు, సీఐలను నిమ్మగడ్డ ఇప్పటికే బదిలీ చేశారు.