Begin typing your search above and press return to search.

పట్టు వదలని నిమ్మగడ్డ

By:  Tupaki Desk   |   24 Nov 2020 11:45 AM IST
పట్టు వదలని నిమ్మగడ్డ
X
విక్రమార్కుడు బేతాళ కథల్లో లాగ స్ధానిక సంస్దల ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ప్రయత్నాలు కంటిన్యు చేస్తునే ఉన్నారు. ఎన్నికలను నిర్వహించటానికి ఆర్ధిక, ఆర్ధికేతన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైనే ఉందంటూ నిమ్మగడ్డ తాజగా చీఫ్ సెక్రటరికి రాసిన లేఖలో గుర్తు చేశారు. ఫిబ్రవరిలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తన లేఖలో నిమ్మగడ్డ స్పష్టం చేయటం విచిత్రంగా ఉంది.

ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమీషన్ దే తుది నిర్ణయమని, కమీషన్ తీసుకున్న నిర్ణయాన్ని కాదనటం రాజ్యాంగాన్ని కాదనటమే అంటు పాత వాదననే మళ్ళీ వినిపించారు. సరే నిమ్మగడ్డ వినిపించిన పాత పాటనే చీఫ్ సెక్రటరీ కూడా వినిపిస్తుందనటంలో సందేహం లేదు. కాబట్టి వీళ్ళద్దరి మధ్య లేఖల యుద్ధం ఎన్నిసార్లు జరిగినా ఫలితమైతే ఉండదు. ఇక్కడే ఓ సందేహం వస్తోంది అందరికీ. తన లేఖల్లో కోర్టు తీర్పులను ప్రస్తావిస్తున్న నిమ్మగడ్డ కోర్టులో కేసు ఎందుకు వేయటం లేదని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో చాలాసార్లు నిమ్మగడ్డకు కోర్టులో కేసులు వేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు కూడా అదే పద్దతిలో కోర్టులో కేసులు వేసి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు కదా ? ఆ విషయాన్ని వదిలేసి కేవలం చీఫ్ సెక్రటరీకి లేఖలు రాయటంతోనే ఎందుకు కాలాన్ని గడిపేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ బూచిని చూపించి ఎన్నికలను వాయిదా వేశారో అదే బూచి ఇపుడు నిమ్మగడ్డకు అడ్డంకిగా మారింది. ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్సే కారణమని ప్రభుత్వం గణాంకాలతో సహా కోర్టుకు నివేదికను ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికలను నిర్వహించాల్సిందే అంటు కోర్టు చెప్పలేందు కదా.

ఇదే సమయంలో కరోనా వైరస్ కారణంగా తాము స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేమని ఇప్పటికే ఉద్యోగుల సంఘం ప్రకటించేసింది. అవసరమైతే ఇదే విషయమై కోర్టులో కేసు వేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు ఇఫ్పటికే ప్రకటిచేశారు. ప్రాణభయంతోనే తాము ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేమని నేతలు చెప్పిన తర్వాత కోర్టు ఏమంటుంది ? ప్రాణాలకు తెగించైనా సరే ఎన్నికల నర్వహణలో పాల్గొనాల్సిందే అని చెప్పలేందు కదా. ప్రభుత్వ ఉద్యోగుల సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు. మరి ఈ విషయం తెలీకుండానే ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ పదే పదే చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తున్నారా ? ఏమిటో నిమ్మగడ్డ వైఖరే విచిత్రంగా ఉంది.