Begin typing your search above and press return to search.

అత్యాచారం చేస్తే పురుష‌త్వం క‌ట్

By:  Tupaki Desk   |   14 Sept 2020 9:00 AM IST
అత్యాచారం చేస్తే పురుష‌త్వం క‌ట్
X
దేశంలో అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై కొన్నేళ్లుగా ఎంతో చ‌ర్చ జ‌రుగుతోంది. తీవ్ర స్థాయిలో ఆందోళ‌నలు జ‌రిగాయి. నిర్భ‌య కేసులు నిందితుల‌కు ఉరిశిక్ష అమ‌లైంది. దిశ కేసు నిందితులు ఎన్‌కౌంట‌ర్ అయ్యారు. అయినా స‌రే.. రేప్ కేసులు ఏమీ ఆగిపోలేదు. అన్ని కేసులనూ ఇంతే సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని, క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అలా జ‌ర‌గట్లేదు. ఐతే విదేశాల్లో అత్యాచార నిందితులకు విధించే శిక్ష‌ల గురించి త‌ర‌చుగా వార్త‌లొస్తుంటాయి. అలా ఇండియాలోనూ చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంటుంది. తాజాగా నైజీరియాలోని ఒక రాష్ట్ర‌ ప్ర‌భుత్వం అత్యాచార నిందితుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే దిశ‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

నైజీరియాలోని క‌దుమా రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలినవారికి ఆపరేషన్ చేసి పురుషత్వం కోల్పోయేలా చేయాలని నిర్ణయించారు. ఈ శిక్షకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది చట్ట రూపం దాల్చడానికి ఆ రాష్ట్ర గవర్నర్ నాసిర్ అహ్మద్ ఎల్ రుఫాయీ సంతకం చేయాల్సి ఉంది. రేపిస్టులు పదేపదే ఆ నేరం చేయకుండా వారికి క్యాస్ట్రేషన్ చేయాలన్న వాదనకు రుఫాయీ గతంలో మద్దతివ్వడంతో ఆయన దీనిపై సంతకం చేస్తారని భావిస్తున్నారు.

కదుమా రాష్ట్రంలో ఇటీవల కాలంలో అత్యాచారాలు ఎక్కువవడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. నైజీరియాలో అత్యాచార బాధితుల్లో చాలామంది తమపై జరిగిన అకృత్యాన్ని చెప్పుకోవడానికి వెనుకాడుతారు.. సమాజం ఎక్కడ చిన్నచూపు చూస్తుందోనని ఆందోళన చెందుతారు. అంతేకాదు.. ఈ కేసుల్లో దోషులకు శిక్ష పడడమూ అక్కడ తక్కువే. ఐతే 2015లో నైజీరియాలో అత్యాచారాలకు సంబంధించిన కొత్త చట్టం ప్రవేశపెట్టిన తరువాత దోషులకు శిక్ష పడే అవకాశాలు పెరిగాయి. నైజీరియా జాతీయ చట్టాల ప్రకారం అత్యాచార దోషులకు అక్కడ 14 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంటుంది.