Begin typing your search above and press return to search.

ఆ పత్రికకు పంచ్ పడిందిగా...

By:  Tupaki Desk   |   19 May 2016 4:03 PM GMT
ఆ పత్రికకు పంచ్ పడిందిగా...
X
అది 2004 ఎన్నికల ఫలితాలు వెల్లడవడానికి రెండు మూడు రోజుల ముందు మాట. మళ్లీ తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రాబోతోందంటూ ఆ పార్టీకి అత్యంత అనుకూలమైన ఓ అగ్ర పత్రికలో పతాక స్థాయి కథనం తయారైంది. అది దాదాపుగా ప్రచురణకు కూడా సిద్ధం అవుతున్న తరుణంలో మేనేజ్మెంట్లోని ఓ కీలక వ్యక్తి ఆ కథనాన్ని ఆపించినట్లు ఆ పత్రిక వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. దీని గురించి ఓసారి ఆ పత్రికకు బద్ధ శత్రువైన మరో పత్రికలో వార్త కూడా వచ్చింది. సరేలే.. ఆ పత్రిక తెలుగుదేశం పార్టీ పక్షపాతి కాబట్టి ఆమాత్రం ఉత్సాహం ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఇవాళ తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్న తరుణంలో వేసిన ఓ కార్టూన్ మాత్రం ఆశ్చర్యం కలిగించేదే.

తమిళనాట రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ పత్రికలో ఓ కార్టూన్ వేశారు. అందులో జయలలిత ఇంట్లో మెడవరకు నీళ్లలో మునిగి టీవీలో ఫలితాలు చూసుకుంటున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్ ఉద్దేశమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెడవరకు మునిగిన జయ.. ఇక ఫలితాలు చూసుకుని పూర్తిగా మునగడం మాత్రమే మిగిలి ఉందన్న సంకేతాల్నిచ్చింది ఆ కార్టూన్. ఈ కార్టూన్ వెనుక వేరే ఉద్దేశాలు లేకుంటే.. కరుణానిధి.. విజయ్ కాంత్ లతో పాటు అందరినీ ఒకే సీన్లోకి తీసుకొచ్చి ఉండొచ్చు. అలా కాకుండా జయలలితను మాత్రమే చూపించడాన్ని బట్టి ఆమె ఓటమి ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా కార్టూన్ వేసినట్లు స్పష్టమవుతోంది. కానీ ఈ రోజు రిజల్ట్ అమ్మకు అనుకూలంగా రావడంతో ఆ పత్రికకు గట్టి పంచ్ పడ్డట్లయింది.