Begin typing your search above and press return to search.

నెల్లూరు కార్పోరేషన్ లో చీలిక తెచ్చిన కోటం రెడ్డి

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:36 PM GMT
నెల్లూరు కార్పోరేషన్ లో చీలిక తెచ్చిన కోటం రెడ్డి
X
ఇప్పటికి రెండేళ్ల క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కార్పోరేషన్లు వైసీపీ పరం అయ్యాయి. అలా నెల్లూరు కార్పోరేషన్ని కూడా మొత్తం సీట్లను స్వీప్ చేసి భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది. నెల్లూరు కార్పోరేషన్ లో 54 సీట్లు ఉంటే అన్నీ వైసీపీ పరం అయ్యాయి.

ఇక నెల్లూరు కార్పోరేషన్ లో 26 కార్పోరేటర్ల సీట్లు రూరల్ జిల్లా నుంచి ఉన్నాయి. రూరల్ ఎమ్మెల్యే నిన్నటి దాకా వైసీపీలోనే ఉన్నారు. కాబట్టి ఆయన వర్గం అయినా ఎవరికీ ఏ బాధా లేకపోయింది. కానీ ఇపుడు ఆయన వైసీపీ నుంచి దూరం జరిగారు. దాంతో ఆయన వర్గం కార్పోరేటర్లు ఎంత మంది అన్నది చర్చకు వస్తోంది. రూరల్ జిల్లాకు కొత్త ఇంచార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని వైసీపీ అధినాయకత్వం నియమించింది.

అయితే ఆదాలా ఈ పదవి దక్కించుకున్న తరువాత ఫస్ట్ టైం నెల్లూరు వచ్చినపుడు భారీ ర్యాలీని నిర్వహించారు. అయితే రూరల్ జిల్లా నుంచి అనుకున్నంతగా కార్పోరేటర్లు రాలేదు. దాంతో కోటం రెడ్డి బలం ఏంటి అన్నది చర్చగా ఉంది. ఇక ఈ రోజు ఆదాల తన ఆఫీసులో పార్టీ నాయకులు కార్పోరేటర్లతో మీటింగ్ పెట్టారు. దానికి పద్దెనిమిది మంది కార్పోరేటర్లు హాజరయ్యారు. అయితే వైసీపీ నేతలు చెప్పిన దాని బట్టి చూస్తే మరో నలుగురైదుగురు తమకు అనారోగ్య కారణాల వల్ల తాను రాలేకపోయాయమని భోగట్టా.

ఇక నువ్వా నేనా అంటూ వైసీపీ హై కమాండ్ నే సవాల్ చేస్తున కోటం రెడ్డి అటు ఆదాల మీటింగ్ ముగియగానే ఇలా నెల్లూరులో ఆత్మీయ నేతల సమావేశం పేరిట మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. తాను పార్టీ నుంచి బయటకు వస్తే అంతా ఉలిక్కిపడుతున్నారు అని ఆయన ఘాటైన విమర్శలు చేశారు రూరల్ జిల్లాకు హామీలే తప్ప నిధులను ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన దుయ్యబెట్టారు

తాను ఉన్నది ఉన్నట్లుగా అడిగితే తప్పు చేసినట్లుగా తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం తాను పాటు పడడం తప్పా, వారి సమస్యల మీద నిలదీయడం తప్పా అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా కోటం రెడ్డి పెట్టిన సమావేశానికి ఎనిమిది మంది కార్పోరేటర్లు హాజరయ్యారు. ఆదాల మీటింగుకు గైర్ హాజరైన వారు ఇక్కడ కనిపించడం విశేషం.

దీంతో కార్పోరేషన్ లో కోటం రెడ్డి వర్గం కార్పోరేటర్ల బలం ఎనిమిది అని అఫీషియల్ గా తేల్సింది అని అంటున్నారు. అయితే ఇంకా తమ సంఖ్య ఎక్కువే అని కోటం రెడ్డి వర్గీయులు అంటున్నారు ఆదాల వైపు వెళ్ళిన వారు కూడా తమ వైపే నని చెబుతున్నారు.

ఇక కోటం రెడ్డి వైపు నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి కూడా హాజరయ్యారు. ఆమె మొదటి నుంచీ కోటం రెడ్డికి మద్దతుగా ఉన్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేసి అయినా కోటం రెడ్డి వెంటే ఉంటాను అంటున్నారు. ఇక కార్పోరేషన్ లో చూస్తే 54 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఎమెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. దాంతో వైసీపీకే బలం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తన బలం ఇంకా పెంచుకోవడానికే కోటం రెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన మరోసారి తన వర్గీయులతో సమావేశం అయి కీలక నిర్ణయం దిశగా సమాలోచనలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.

తన వైపు ఉన్న పొట్లూరి స్రవంతి కి మేయర్ పదవి పోకుండా కోటం రెడ్డి ఏ రకమైన రాజకీయాన్ని రచిస్తారో చూడాలి. ఏది ఏమైనా అధికారంలో వైసీపీ ఉంది. మొత్తం బలమంతా వారే ఉన్నారు కాబట్టి పొట్లూరి స్రవంతి కి మేయర్ పదవి పోవడం ఖాయమనే అంటున్నరు. అయితే ఎక్కువ మంది కార్పోరేటర్లు కోటం రెడ్డితో ఉంటే మాత్రం తమకు ఇబ్బంది కాబట్టి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు సామ దానా భేద దండోపాయాలను వారు ఉపయోగిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఆట ఇపుడే స్టార్ట్ అయింది అని అంటున్నారు. మరి ఇందులో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయన్నది మాత్రం వాస్తవం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.