Begin typing your search above and press return to search.

భీమిలీలో ల్యాండ్ అయిన గంటా...?

By:  Tupaki Desk   |   5 April 2022 4:30 PM GMT
భీమిలీలో ల్యాండ్ అయిన గంటా...?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పాత సీటు మీద మోజు పెంచుకుంటున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. భీమునిపట్నం సీటు అంటే గంటాకు చాలా ఇష్టం. ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి దాదాపుగా నలభై వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

అయిదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తిరిగి 2019 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే అదే సీటు కోసం పట్టుబట్టిన నాటి టీడీపీ నేత అవంతి శ్రీనివాసరావు చివరికి వ్యవహారం తెగక వైసీపీలో చేరిపోయారు. అలా అవంతి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనే తరువాత రుజువు అయింది. ఆయన భీమిలీ నుంచి గెలవడంతో పాటు మంత్రి కూడా అయ్యారు.

ఇక వచ్చే ఎన్నికలలో ఆయన భీమిలీ నుంచి పోటీకి రెడీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో గంటా కూడా భీమిలీ మీద ఫోకస్ పెట్టడం విశేషంగా ఉందిపుడు. గంటా ఈ మధ్య తరచూ భీమిలీ వస్తున్నారు. అలాగే భీమిలీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో వివిధ సందర్భాలలో ఆయన పర్యటిస్తున్నారు.

భీమిలీలో గంటాకు మంచి మద్దతు ఉంది. ఆయనకంటూ ఒక వర్గం కూడా ఉంది. దాంతో గంటా చూపు భీమిలీ మీద పడింది అంటున్నారు. తాజాగా భీమిలీ మాజీ మండలాధ్యక్షురాలు, టీడీపీ మహిళా నేత ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి గంటా భీమిలీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో భీమిలీలో టీడీపీ జెండా ఎగిరేలా కార్యకర్తలు అంతా పనిచేయలాని గంటా కోరారు. దాంతో పాటు అనేక మంది నాయకులతో కూడా భీమిలీలో పార్టీ పరిస్థితి మీద ఆయన ముచ్చటించారు. ఈ నేపధ్యంలో గంటా భీమిలీ నుంచి పోటీ చేస్తారు అని గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

ఆయన టీడీపీ అధినాయకత్వంతో కొంత గ్యాప్ ని మెయింటెయిన్ చేస్తున్నారు అని ప్రచారం ఉంది. చంద్రబాబు ఆ మధ్య ఏర్పాటు చేసిన విశాఖ టీడీపీ సమావేశానికి గంటా వెళ్లలేదు. అయితే ఆయన టీడీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. దాంతో అన్నీ అనుకూలించి తనకు సరైన భరోసా ఉంటే టీడీపీ నుంచి గంటా పోటీ చేయవచ్చు అని అంటున్నారు.

ఇక గంటా ఒక బలమైన రాజకీయ శక్తిగా అంతా చూస్తారు. ఆయన కనుక వస్తే తమ పార్టీలో చేర్చుకోవడానికి అంతా సిద్ధంగా ఉంటారు. ఆయన జనసేనలో చేరుతారు అని కూడా అంటున్నారు. కానీ గంటా జనసేనతో టీడీపీ పొత్తుని మాత్రమే కోరుకుంటున్నారు తప్ప పార్టీని మారరు అని కూడా మరో వైపు వినిపిస్తోంది.

మొత్తానికి గంటా భీమిలీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయడం కన్ ఫర్మ్ అనే అంటున్నారు. అదే కనుక జరిగితే అవంతి శ్రీనివాసరావు ఆయన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇప్పటికీ భీమిలీలో టీడీపీ గట్టిగా ఉంది. దాంతో పాటు గంటా లాంటి బిగ్ షాట్ రంగంలో ఉంటే టైట్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.