Begin typing your search above and press return to search.

దక్షిణాదిలో కొత్త రకం కరోనా ..తెలంగాణ లో ఆనవాళ్లు - కేంద్రం హెచ్చరికలు!

By:  Tupaki Desk   |   20 Feb 2021 4:00 PM IST
దక్షిణాదిలో కొత్త రకం కరోనా ..తెలంగాణ లో ఆనవాళ్లు - కేంద్రం హెచ్చరికలు!
X
గత ఏడాది రోజులకి పైగా ప్రపంచమంతటినీ గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా అక్కడక్కడ రూపాలు మార్చుకొని విజృంభిస్తున్నది. మహమ్మారి రూపాలు వైవిధ్యంగా ఉండటంతో అది కొన్నిచోట్ల ప్రమాదకరంగా ఉంటుండగా.. మరికొన్ని చోట్ల దాని తీవ్రత తక్కువగా ఉన్నది. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ‘ఎన్‌440కే’ రకం వైరస్‌ వేగంగా ప్రబలుతున్నది. కానీ దాని తీవ్రత తక్కువగా ఉన్నది. ఇక ప్రమాదకరమైన బ్రిటన్‌ రకం వైరస్‌ 'ఈ484కే’ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా వ్యాపిస్తున్నది.

హైదరాబాద్‌ లోని సీసీఎంబీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధిక తీవ్రత ఉన్న ‘ఈ484కే’, ‘ఎన్ ‌501వై’ రకాల వైరస్‌ వ్యాప్తి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఐసీఎంఆర్‌ సహకారంతో సీసీఎంబీ కొవిడ్‌-2 జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పై పరిశోధన జరుపుతున్నది. గత ఏడాది కేరళలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన నాటి నుంచే సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించింది. అప్పటి నుంచి వెలుగుచూసిన ఐదువేల రకాల జన్యుపరివర్తనలపై లోతైన అధ్యయనం చేసింది. పరిశోధకులు కరోనా జన్యువులలో తేడాలను గుర్తించగలిగారు.

దక్షిణాదిలో ఉన్న వైరస్ ‌ను ‘క్లేడ్‌ ఏ3ఐ’గా, ఉత్తరాది రాష్ట్రాల్లోని వైరస్ ‌ను ‘క్లేడ్ ‌ఏ2ఏ’గా నిర్ధారించారు. తుది దశలో కొన్ని వందల నమూనాలను పరిశీలించిన సీసీఎంబీ బలహీన వైరస్‌గా భావిస్తున్న ‘క్లేడ్‌ఏ3ఐ’ వేగంగా అంతరించినట్లు గుర్తించింది. ఉత్తరాదిన వేగంగా విస్తరించిన క్లేడ్‌ఏ2ఏ ఆ తరువాత ‘డీ614జీ’గా రూపాంతరం చెందిందని తెలిపారు. ఆ తరువాత ‘ఎన్‌440కే’గా మారినట్టు కనుగొన్నారు. ఇది ఏపీ, తెలంగాణ, కేరళ లో వ్యాపిస్తున్నదని పేర్కొన్నారు. దక్షిణాదిలో విస్తరిస్తున్న ఈ వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వైరస్‌ సోకిన వారికి లక్షణాలు కూడా కనిపించడం లేదని తెలిపారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ల తీవ్రత అంతగా లేకపోయినా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. కరోనాపై యుద్ధం ఇంకా ముగియలేదని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.