Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ పార్టీకి మాజీలుగుడ్ బై చెప్పటమా?

By:  Tupaki Desk   |   14 Dec 2020 7:00 PM IST
టీఆర్ఎస్ పార్టీకి మాజీలుగుడ్ బై చెప్పటమా?
X
అంతా బాగున్నప్పుడు ఉండే పరిస్థితులకు.. తర్వాత చోటు చేసుకునే పరిస్థితులకు పోలిక ఉండదు. దుబ్బాక.. గ్రేటర్ హైదరాబాద్ మహానగర సంస్థకు జరిగిన స్థానిక ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఇబ్బందుల్ని తీసుకొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు లేని కొత్త బెడద ఇప్పుడు తలెత్తనుంది. కేసీఆర్ కు అడ్డాలాంటి కరీంనగర్ జిల్లాకు చెందిన డిప్యూటీ మేయర్ ఒకరు పార్టీకి రాజీనామా చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేశ్..తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖ ఒకటి మంత్రి గంగుల కమలాకర్ కు పంపారు. ఇప్పుడాయన బీజేపీలోకి చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసిన ఆయన.. త్వరలోనే తాను పార్టీ మారనున్నట్లు చెప్పారు.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఆ మధ్యన జరిగిన స్థానిక ఎన్నికల్లో రమేశ్ సతీమణి కార్పొరేటర్ గా ఎన్నికల్లో విజయం సాధించారు. అలాంటిది ఆయన.. గులాబీ కారు దిగేసి.. కమలం గూటికి వెళ్లేందుకు రెఢీ అవుతున్నారు. దీంతో అప్రమత్తమైన మంత్రి గంగుల కీలక నేతలతో కలిసి ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ నేతలకు.. కార్యకర్తలకు తాను.. పార్టీ అధినేత కేసీఆర్ అండగా ఉంటామని చెప్పటం గమనార్హం.

ఈ కేర్.. గడిచిన ఆరేళ్లలో ఎక్కడకు వెళ్లిందన్న మాట వినిపిస్తోంది. పార్టీ నుంచి ఎలాంటి పలుకరింపులు రాకపోవటం.. ఎన్నికల వేళలో టికెట్ల కోసం భారీ ఎత్తున పైరవీలు చేయాల్సి రావటంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. వరుస ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటంతో.. ఇప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామం స్థానికంగా కలకలం రేపటమే కాదు.. గులాబీ గూటికి కొత్త చిక్కు వచ్చినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఇలాంటి వాటికి గులాబీ బాస్ ఎలాంటి చెక్ పెడతారో చూడాలి.