Begin typing your search above and press return to search.

జ‌గన్ మ‌న‌సు దోచుకోవాలి... ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌

By:  Tupaki Desk   |   6 March 2022 8:00 PM IST
జ‌గన్ మ‌న‌సు దోచుకోవాలి... ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌
X
గ‌త కొద్దికాలంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఏపీలో మూడు రాజధానుల అంశంలో హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ , తీర్పు త‌ర్వాత కూడా... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓ వైపు ... మూడు రాజధానులే మా విధానం అంటూ మరోవైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఈ స‌మ‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌న‌సు దోచుకునేలా వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. దీనిపై శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ , ఆయ‌న సోద‌రుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేస్తున్న వ్యాఖ్య‌లు ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు.

హైకోర్టు తీర్పు, మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ, రాజ‌ధాని పేరుతో చంద్రబాబు చేసిన పని స్వార్థపూరిత, ఒక సామాజిక వర్గ ప్రయోజనం కోసం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానుల ఆలోచన చేస్తోందన్నారు.

వెనుకబడిన రాయలసీమ, వెనక్కి నెట్టబడిన ఉత్తరాంధ్రలో కొన్ని దశాబ్దాల తర్వాత ఉద్యమాలు రాకూడదు అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మూడు రాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిప‌డ్డారు.

మ‌రోవైపు డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ సోద‌రుడు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించిన శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో 'Doctrine of Separation of powers' గా పేర్కొంటూ రాజ్యాంగం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు.

ఒకటికి పది సార్లు చెబుతున్నాం… మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్న ఆయన.. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందని.. అందులో కూడా పాలన వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారని దానిని మేం తీసుకున్నామని తెలిపారు.

త‌మ నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలు త‌మకు ప్రామాణికం కానీ తెలుగుదేశం పార్టీ నేతల ఆలోచనలు మాకు ప్రామాణికం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మూడు రాజ‌ధానుల విష‌యంలో రానున్న అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.