Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు కొత్త బాధ్య‌త‌లు...తేడా వ‌స్తే అంతే

By:  Tupaki Desk   |   16 May 2019 12:35 PM IST
కేటీఆర్‌ కు కొత్త బాధ్య‌త‌లు...తేడా వ‌స్తే అంతే
X
తెలంగాణ‌లో ఎన్నిక‌ల రాజ‌కీయం దాదాపు గ‌త తొమ్మిది నెల‌లుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముంద‌స్తు ఎన్నిక‌లు తెర‌మీద‌కు వ‌చ్చిన 2018 సెప్టెంబ‌ర్ నుంచి ఒక ఎన్నిక త‌ర్వాత మ‌రో ఎన్నిక అన్నట్లుగా... వివిధ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక‌ల విష‌యంలో టీఆర్ ఎస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై కీల‌క బాధ్య‌త‌లు ఉంచారు. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను కేటీఆర్‌ చూస్తారు. ఎమ్మెల్సీ ఓటర్ల క్యాంపుల నుండి ఓటు హక్కు వినియోగించుకునే వరకు సాగే ప్రక్రియను పర్య వేక్షించనున్నారు.

గత ఎన్నికల్లో నల్లగొండ స్థానం టీఆర్ ఎస్‌ చేజారగా ఉప ఎన్నికల్లో దానిని కూడా గెలుచుకోవాలని టీఆర్ ఎస్‌ పట్టుదలగా ఉంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని, నిర్లక్ష్యం దరిచేరకుండా ప్రతిఓటు టీఆర్ ఎస్‌ అభ్యర్ధికి పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో నేతలంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదనే ఒక్కో స్థానానికి ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీకి బాధ్యతలు అప్పగించింది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న స్థానిక ప్రతినిధులను మంత్రులకు అప్పగించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై పెట్టింది. సీఎం కేసీఆర్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూడుజిల్లాల్లోనూ మళ్ళీ ఎన్నికల వేడి రాజుకుంది.

టీఆర్ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అప్ప‌గించిన ఈ బాధ్య‌త‌ల నేప‌థ్యంలో క్యాంప్ రాజ‌కీయాలు తెర‌మీద‌కు వ‌చ్చాయంటున్నారు. అన్ని ఎమ్మెల్సీ స్థానాల ఓటర్లను ఒకేచోటికి కాకుండా వేర్వేరు ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పక్కాప్రణాళికలు, రూట్‌ మ్యాప్‌ లు ఖరారైనట్లు తెలుస్తోంది. నల్లగొండ స్థానికసంస్థల నియోజకవర్గంలో 1102మంది ఓటర్లుండగా, ఇందులో 800మందిని సౌత్‌ కాశ్మీర్‌ గా పేరున్న కేరళలోని హిల్‌ స్టేషన్‌ మున్నార్‌కు తరలించనున్నారు. ఈమేరకు నల్లగొండ ప్రజాప్రతినిధులకు సమాచారం అందగా, ఇప్పటికే పలువురు హైదరాబాద్‌ కు చేరుకున్నట్లు సమాచారం. గురువారం ఉదయం కల్లా టీఆర్ ఎస్‌ ప్రజాప్రతినిధులంతా హైదరాబాద్‌ చేరుకోవాలని ఆదేశాలు అందాయి. 800మందిని ఒకేచోటకు తరలించాలా.. వేర్వేరు ప్రాంతాలకు తరలించాలా అన్నది హైదరాబాద్‌ వచ్చాక ఖరారుచేస్తారు. గ్రూపులవారీగా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనుండగా, వారిపైన మంత్రులు, ఆపైన పార్టీ పరిశీలకులు క్యాంపుల వ్యవహారాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.