Begin typing your search above and press return to search.

మిత్రపక్షాల అగ్రనేతలు దూరమేనా ?

By:  Tupaki Desk   |   17 Dec 2021 9:30 AM GMT
మిత్రపక్షాల అగ్రనేతలు దూరమేనా ?
X
అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరగబోతున్న బహిరంగ సభకు అగ్రనేతల్లో చంద్రబాబునాయుడు మాత్రమే హాజరవుతారా ? చూస్తుంటే అలాగే ఉంది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన అధ్యక్షులు సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ హాజరుకావటం లేదని సమాచారం. ముందేమో చంద్రబాబుతో పాటు వీర్రాజు, పవన్ కూడా హాజరవుతారని విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ చివరి నిముషంలో మిత్రపక్షాల అగ్రనేతలు బహిరంగసభకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

చివరి నిముషంలో ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్లు ? ఎందుకంటే మొన్నటి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంట్లో తెలంగాణా, ఏపీ ఎంపీలు, ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలే తాజా పరిణామాలకు కారణమని సమాచారం. ఇంతకీ మోడీ ఏమన్నారంటే తెలంగాణాలో టీఆర్ఎస్ కు ఏపీలో తెలుగుదేశంపార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ధీటుగా ఎదగాలని గట్టిగా చెప్పారట.

అవసరమైతే పై రెండుపార్టీల నుండి బలమైన నేతలను బీజేపీలోకి ఆకర్షించాలని కూడా ఆదేశించారట. తెలంగాణాలో టీఆర్ఎస్ విషయంలో బీజేపీ దూకుడు బాగానే ఉన్నా మరింతగా పెంచాలని చెప్పారట. అలాగే ఏపీలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ దూకుడు పెంచాలని ఆదేశించారట. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుల గురించి చర్చ వచ్చినపుడు బీజేపీ సొంతంగానే ఎదగేందుకు ప్రయత్నించాలని స్పష్టంగా మోడీ చెప్పారట.

మోడీ వ్యాఖ్యలతో భవిష్యత్తులో చంద్రబాబుతో పొత్తు మోడీకి ఇష్టంలేదనే విషయం స్పష్టమైపోయింది. చంద్రబాబుతో పొత్తే వద్దని, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని మోడీ చెప్పిన తర్వాత ఇక ఒకే వేదికను ఎలా పంచుకుంటారు ? అందుకనే చివరినిముషంలో వీర్రాజు తిరుపతి సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షం నిర్ణయం తెలిసిన తర్వాత పవన్ కూడా అదే దారిలో ప్రయాణించాలని అనుకున్నారట.

అందుకనే పై రెండు పార్టీల తరపున స్ధానిక నేతలు మాత్రమే బహిరంగసభకు హాజరవబోతున్నారు. అమరావతికి మద్దతుగా జరిగిన పాదయాత్రలో కలిసి నడవటం, బహిరంగసభలో వేదికన పంచుకోవటంతో భవిష్యత్తులో బీజేపీ+జనసేనతో టీడీపీ పొత్తు ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది. అయితే హఠాత్తుగా జరిగిన డెవలప్మెంట్ తో టీడీపీ పొత్తుల విషయంలో మళ్ళీ అయోమయం మొదలైంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.