Begin typing your search above and press return to search.

డిసెంబర్ లో తెలంగాణలో కొత్త పార్టీ

By:  Tupaki Desk   |   27 Oct 2021 12:30 PM GMT
డిసెంబర్ లో తెలంగాణలో కొత్త పార్టీ
X
తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ జరుగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్ మునిగిపోయారు.

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న శివశంకర్ తనయుడు వినయ్ కుమార్ ఇవాళ హైదరాబాద్ లో తన మద్దతుదారులతో కీలక సమావేశం నిర్వహించారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్ తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వినయ్ వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లో కొత్త పార్టీ పేరును, జెండా, అజెండాను ప్రకటిస్తామంటున్న వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

డాక్టర్ వినయ్ కుమార్ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలిసిపోయింది. తనను రాజకీయాల్లోకి రావాలని డాక్టర్ మిత్ర కోరారని వినయ్ చెప్పుకొచ్చాడు. 2014 జులై 27న మాసాయిపేట రైలు ప్రమాదం నన్ను కలిచివేసిందని తెలిపారు. చదివించడం ప్రభుత్వ బాధ్యత అని.. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో స్టాండర్డ్స్ కూడా లేవని విమర్శించారు.

తాను చాలా గ్రామాల్లో తిరిగానని.. ప్రభుత్వ స్కూళ్లలో విద్య సరిగ్గా లేక.. ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు. విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. నేను కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీచేసి అదే సమయంలో నోటాకు ఓటు వేశానంటూ వినయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే తెలంగాణలో అటు వైఎస్ షర్మిల, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు కొత్త పార్టీలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ కూడా మరో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో పార్టీలు ఎక్కువైపోతున్నాయి.