Begin typing your search above and press return to search.

బీజేపీని ఇరికించిన మోడీ

By:  Tupaki Desk   |   23 Aug 2015 3:34 PM IST
బీజేపీని ఇరికించిన మోడీ
X
ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ కు ప్రకటించిన లక్షా అరవై ఐదువేల కోట్ల రూపాయల ప్యాకేజి ఆ రాష్ర్ట ఎన్నిక‌ల్లో ఏమాత్రం ఓట్లు తెచ్చి పెడుతుందో

తెలియ‌దు గాని, మోడీకి కొత్త చిక్కులు మొద‌ల‌య్యాయి. మోడీ తాజా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఇతర రాష్ట్రాలనుంచి ప్రధానమంత్రికి, బీజేపీకి తీవ్రమైన తలనొప్పి తీసుకోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై తమకూ అటువంటి ప్యాకేజిలను ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నాయి.

రాజ్యసభలో కీలక బిల్లులు నెగ్గించుకునేందుకు ఎన్డీఏలోని పార్టీలకు ఉన్న ఓట్లు స‌రిపోవ‌డం లేదు.ఆయా బిల్లులకు మద్దతు సమీకరించుకోవడానికి బీజేపీ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఈ క్ర‌మంలో ప్రాంతీయ పార్టీల‌పై ఎక్కువ‌గా బీజేపీ ఆధార‌ప‌డింది. దీంతో తటస్థ పార్టీలు ఇదే అద‌నుగా నిధుల కోసం ప్రత్యేక ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాయి.

ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగు దేశం పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర ప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కల్పించక పోవడం పట్ల ఆగ్రహంగానే ఉంది.బీహార్‌ కు ప్యాకేజి ప్రకటించగానే తమకూ 2.50 లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని కోరుతూ 200 పేజీల నోట్‌ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే భేటీలో మోడీకి ఇది అందించ‌నున్నారు.

బీజేపీ మిత్రపక్షం అయిన అకాళిదళ్ అధినేత,పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ పంజాబ్‌ కు ప్రత్యేక ప్యాకేజి అవసరం ఉందని స్టేట్‌ మెంట్ ఇచ్చారు. బీహార్ లాంటి ప్యాకేజి పంజాబ్‌ కు కావాలని కోరారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తాము ఏ రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజి ఇచ్చిన వ్యతిరేకించబోమని అయితే పెండింగ్‌ లో ఉన్న తమ డిమాండ్‌ లను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆపార్టీ పార్లమెంట్‌ పక్ష నాయకుడు వరద సహాయ ప్యాకేజి తో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి 10 వేల కోట్ల ప్యాకేజీ కొరుతున్నారు. మరోవైపు బిజు జనతా దళ్‌ కూడా ఒడిషా కు ప్రత్యేక ప్యాకేజీ కొరుతున్నారు.రాజ్యసభలో తమ మద్దతు కావాలంటే కేంద్ర ప్రభుత్వం తప్పని సరిగా ఒడిషా కు ప్యాకేజీ ఇవ్వల్సిందే అని బిజు జనతా దళ్‌ అంటోంది.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కేంద్ర ప్రభుత్వ పధకాలకు సంబంధించిని నిధుల కోసం 44 డిమాండ్లుతో ఇప్పటికే ప్రధాన మంత్రికి, పలువురు కేంద్ర మంత్రులకు 100 కు పైగా ఉత్తరాలు రాశారు. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు బుందేల్‌ఖండ్‌కు అభివృద్ధి ప్యాకేజి ప్రకటించమని కోరుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన ఇంటికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ కి విందు భోజనంతోపాటు పెద్ద డిమాండ్ల పత్రాన్నే ఇచ్చారు.

మొత్తంగా బీహార్ ఎన్నికల్లో మోడీ ప్యాకేజీల హామీలు పని చేస్తాయో లేదో కాని నరేంద్ర మోడీ ఎత్తుగ‌డ కొత్త తలనెప్పులను తెస్తోందని క‌మ‌ల‌ద‌ళం అగ్ర‌నేత‌లు వాపోతున్నారు.