Begin typing your search above and press return to search.

వైరస్ గుప్పిట్లో ప్రపంచం..ఒక్కరోజే లక్షా 36 వేల కేసులు!!

By:  Tupaki Desk   |   10 Jun 2020 6:50 AM GMT
వైరస్ గుప్పిట్లో ప్రపంచం..ఒక్కరోజే లక్షా 36 వేల కేసులు!!
X
దేశంలో ఈ మహమ్మారి కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజూ కూడా 9 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్ర - ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నిర్ధారణ అయ్యాయి.

కాగా , గత 40 రోజుల్లో దేశంలో దాదాపు 86 శాతం వైరస్ కేసులు నమోదయ్యాయని హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. కేవలం మే, జూన్ నెల మధ్య 84 శాతం మంది రోగులు మరణించినట్లు వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తికి సంబంధించినంతవరకు మే నెలలో భారతదేశంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క మే నెలలోనే 1,53,000 కేసులు నమోదయ్యాయి. ఐదో దశ లాక్ డౌన్ నుండి కేంద్రం భారీగా సడలింపులు ఇవ్వడంతో జూన్ 1 నుండి గడిచిన తొమ్మిది రోజుల్లోనే దేశంలో 76,000 కి పైగా వైరస్ కేసులు నమోదయ్యాయని హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది.

ప్రస్తుత అన్‌ లాకింగ్‌ దశలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో మాల్స్ - మతపరమైన ప్రదేశాలు - రెస్టారెంట్లు సోమవారం నుంచి ఓపెన్ చేసారు. అధిక కేసులు నమోదవుతున్న కంటైన్ మెంట్‌ జోన్లు మినహాయించి దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు - ఇతర సంస్థలు కూడా తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ అనేక దేశాలతో పోల్చితే ఈ వైరస్ పై పోరాటంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని తెలిపారు. సామాజిక దూరం, చేతుల శుభ్రత - మాస్క్‌లు - ఫేస్‌ కవర్లు వంటి నిబంధనలను కఠినంగా పాటించడం ద్వారా వైరస్ కి వ్యతిరేకంగా పాటిస్తోన్న సామాజిక వ్యాక్సిన్‌ ను మనం మరచిపోకూడదు అని ఆయన పిలుపునిచ్చారు. ఇకపోతే ప్రస్తుతం పాజిటివ్ కేసుల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే , ఈ మహమ్మారి వైరస్‌ గత డిసెంబరులో చైనాలో వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 71.5 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా.. 4 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఈ వైరస్‌ పై నిర్లక్ష్యం వద్దని డబ్ల్యూహెచ్‌ ఓ హెచ్చరించింది. అమెరికా - దక్షిణాసియా దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ ‌ఓ చీఫ్‌ టెడ్రాస్‌ అద్నామ్‌ ఘెబ్రెయాసస్‌ చెప్పారు.

అలాగే, ఆదివారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,36,000 పైగా కేసులు నమోదయ్యాయని అయన వెల్లడించారు. కరోనా వైరస్‌ బట్టబయలై ఆరు నెలలైంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీగా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఏ దేశం కూడా ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వెయ్యకూడదు’ అని అన్నారు. అదే సమయంలో చాలా దేశాలు వైరస్‌పై విజయం సాధించడం ఊరట కలిగించే అంశమని అన్నారు. అయితే నిర్లక్ష్యంతో ఉంటే మళ్లీ వైరస్‌ విజృంభించే అవకాశాలున్నాయని టెడ్రాస్‌ హెచ్చరించారు.