Begin typing your search above and press return to search.

గౌతం రెడ్డి సీటు ఎవరికంటే... ?

By:  Tupaki Desk   |   27 Feb 2022 12:30 AM GMT
గౌతం రెడ్డి సీటు ఎవరికంటే... ?
X
కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన వైసీపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వారసుడి విషయంలో ఇపుడు వైసీపీ అధినాయకత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గౌతం రెడ్డి నెల్లూరు జిల్లాలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా ఎదిగారు. తనకంటూ తిరుగులేని ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. 2014, 2019లలో రెండుసార్లు ఆత్మకూరు నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా పనిచేశారు.

చివరిదాకా ఆయన ఏపీకి పెట్టుబడులు తేవాలనే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఆయన ప్రయత్నాలు ఫలించే దశలో ఉండగా కన్నుమూశారు. ఇక మార్చి 2తో గౌతం రెడ్డి దశ దిన కర్మలు పూర్తి అవుతాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఆత్మకూరు స్థానం ఖాలీ అయిన సంగతిని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ అధికారులు తెలియచేశారు.

దాంతో ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల తరువాత జరిగే ఉప ఎన్నికలతో కలిపి కూడా నిర్వహించవచ్చు. దాంతో ఆత్మకూరులో ఎవరికి టికెట్ ఇవ్వాలీ అన్న అంశం అయితే వైసీపీలో చర్చకు వస్తోంది. ఆత్మకూరులో గౌతం రెడ్డి వారసత్వాన్ని ఆయన భార్య శ్రీకీర్తి రెడ్డికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

గౌతం రెడ్డి కుమారుడు క్రిష్ణార్జున రెడ్డి చిన్నవాడు కావడం, తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారం రిత్యా పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవచ్చునని తెలుస్తున్న నేపధ్యంలో భార్యకే పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారు. దాంతో దశ దిన కర్మ తరువాత కుటుంబ సభ్యులకు ఈ సంగతి తెలియచేసి వారి నుంచి కూడా ఒక క్లారిటీ తెచ్చుకుని ఆమె పేరునే అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఆత్మకూరులో వైసీపీ బలంగా ఉంది. పైగా ఇది అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నికలో విపక్షాలు పోటీకి అభ్యర్ధిని పెట్టవని ఆలోచిస్తున్నారు. సో ఏకగ్రీవం అయ్యే చాన్సులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి వైస్ జగన్ మాత్రం శ్రీకీర్తి రెడ్డి పేరునే అనుకుంటున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.