Begin typing your search above and press return to search.

ఇదేం ఫిట్ నెస్ నాయనా.. పంత్ పని పడుతూ ట్రోల్స్

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:20 PM IST
ఇదేం ఫిట్ నెస్ నాయనా.. పంత్ పని పడుతూ ట్రోల్స్
X
ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు టైం అంతగా కలసి రావడం లేదు. తొడ కండరాల వద్ద గాయంతో ఇప్పటికే ఆటకు దూరమైన పంత్ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లలోనూ అంత గొప్పగా ఆడి జట్టును గెలిపించింది లేదు. ఒక్క మ్యాచ్ లోనూ అతడి స్కోరు 40కి మించలేదు. ఇప్పుడు అతడి ఫిట్ నెస్ పై విమర్శలు వస్తున్నాయి. విపరీతంగా లావు అవడంతో అతడిపై నెటిజన్లు పంచ్ లు వేస్తున్నారు. గత శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కీపింగ్ చేస్తూ పంత్ గాయపడ్డాడు. అతడికి తొడ కండరాల వద్ద గాయం కావడంతో వారం నుంచి పది రోజుల పాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. గత ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో అతడి స్థానంలో అలెక్స్ క్యారీ జట్టులోకి వచ్చాడు.

బుధవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని అనుకున్నా అతడిని ఎంపిక చేయలేదు. మ్యాచ్ కు ముందు వార్మప్ షెషన్లో ఫిజియో పర్యవేక్షణలో అతడు మైదానంలో పరిగెత్తుతూ కనిపించాడు. అయితే అతడు పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదని నిర్ధారించుకొని అలెక్స్ క్యారీని మరోసారి బరిలోకి దింపారు. పంత్ మైదానంలో పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి చూసిన నెటిజన్లు పంత్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అతడి లావు పై పంచ్ లు, మీమ్స్ ట్రెండయ్యాయి. ఈ వయసుకే అంకుల్లా మారావంటూ సెటైర్స్ వేశారు. అమిత్ మిశ్రాలా పొట్ట పెంచావ్.. అంటూ మరి కొందరు కామెంట్స్ చేశారు. మార్చి నుంచి అంతర్జాతీయ మ్యాచ్ లు జరగకపోవడంతో ఆటగాళ్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో పంత్ ఫిట్ నెస్ పై తగిన దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మరి ఆ మ్యాచ్ కు అయినా పంత్ ఫిట్ నెస్ సాధిస్తాడో లేదో చూడాలి.