Begin typing your search above and press return to search.

నేతాజీకి భయపడే స్వాతంత్ర్యం ఇచ్చారా?

By:  Tupaki Desk   |   30 Dec 2015 7:42 AM GMT
నేతాజీకి భయపడే స్వాతంత్ర్యం ఇచ్చారా?
X
1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి ప్రపంచంలో బ్రిటన్ పరిస్తితి బలంగానే ఉంది. అప్పటికి రెండేళ్ల ముందు 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచి బ్రిటన్ అంతర్జాతీయంగా మంచి పొజిషన్లో ఉంది. అయినా కూడా ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి కారణం నేతాజీయేనట. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ సంగతి చెబుతున్నారు. 200 ఏళ్ల పాటు ఇండియాను పాలించి అంత సడెన్ గా ఎవరూ ఊహించని సమయంలో వారు స్వాతంత్ర్యం ఇవ్వడానికి కారణం నేతాజీయేనని.... ఆయన వ్యూహాలకు భయపడి... అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో బలమైన శక్తులతో ఆయన కూటమి ఏర్పాటుచేస్తుండడాన్ని గుర్తించే బ్రిటన్ ఇండియా నుంచి మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోయిందని ఆయన అబిప్రాయపడ్డారు.

అప్పట్లో అతివాదిగా ముద్రపడి దేశం వదిలివెళ్లిన నేతాజీ వ్యూహాలతో బ్రిటీషర్లు అప్పటికే మూడు చెరువుల నీరు తాగారని... నేతాజీ అప్పట్లో భారత సైన్యంలోనే చిచ్చురేపడాన్ని చూసి భయపడి బ్రిటిషర్లు దేశాన్ని వీడారని ఆయన చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచి కూడా ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చారంటే అది కేవలం నేతాజీకి భయపడేనని చెబుతూ ఆయన చేసిన ఓ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దేశ భక్తులను, నేతాజీ అభిమానులను ఆ ప్రసంగం ఉర్రూతలూగిస్తోంది. మరి అంతటి ఘనత వహించిన నేతాజీ ఏమయ్యారు... ఆయనకు సంబంధించిన రహస్యాలు ఏమిటనేది ప్రజలకు వెల్లడించాలని ఈ భద్రతా సలహాదారు కేంద్రానికి సూచిస్తే ఇంకా బాగుంటేందేమో!