Begin typing your search above and press return to search.

ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందట .. కారణం ఏంటంటే ?

By:  Tupaki Desk   |   9 Dec 2020 11:27 AM IST
ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందట .. కారణం ఏంటంటే ?
X
ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరగడం ఏమిటని నమ్మలేకపోతున్నారా ,అయితే చెప్పేది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరొందిన ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగింది. ఈ విషయాన్ని నేపాల్, చైనా ప్రభుత్వాలే వెల్లడించాయి. ఈ ఆరు దశాబ్దాల్లో ఎవరెస్టు పర్వతం ఎత్తు సుమారు 86 సెంటీ మీటర్లకు పెరిగిందట. 1954లో భారత ప్రభుత్వం ఎవరెస్టు ఎత్తును కొలిచింది. ఈ సందర్భంగా దాని ఎత్తు.. 8,848 మీటర్లు ఉన్నట్లు తెలిపింది. అయితే, తాజా కొలతల్లో ఆ ఎత్తు 8,848.86 మీటర్లుగా నమోదైంది. నేపాల్ భూకంపం తర్వాత ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉండవచ్చని భావించారు.

ఈ సందర్భంగా చైనా సాయంతో నేపాల్ మరోసారి ఎవరెస్టు ఎత్తును కొలిచింది. ఫలితాల్లో ఎవరెస్టు ఎత్తు తగ్గకపోగా.. 86 సెంటీ మీటర్లు పెరిగింది. 2015లో హిమాలయ పర్వత ప్రాంతంలో విధ్వంసకర భూకంపం సంభవించిన నేపథ్యంలో ఎవరెస్ట్ పర్వతం ఎత్తు మారే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడటంతో, నేపాల్ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం ఈ పర్వతాన్ని కొలిచే కార్యక్రమాన్ని చేపట్టింది. నేపాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సర్వే దీనిని కొలిచింది. ఈ కార్యక్రమంలో నేపాల్, చైనా అధికారులు పాల్గొన్నారు.

సాధారణ పర్వతాలతో పోల్చితే ఎవరెస్టు పర్వతం చాలా భిన్నమైనది. హిమాలయాల్లో ఉన్న ఈ ఎవరెస్ట్ పర్వతానికి సంబంధించిన శిలాఫలకాలు స్వల్పంగా కదులుతుంటాయి. భూకంపాల సమయంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా భారత ఫలకం యురేసియన్ ఫలకంలోచి చొచ్చుకెళ్లేప్పుడు ఏర్పడే ఘర్షణ వల్ల ఇలాంటివి జరుగుతాయి.