Begin typing your search above and press return to search.

నగర నడిబొడ్డున నయీం గ్యాంగ్ ఆరాచకం

By:  Tupaki Desk   |   12 Sep 2016 4:42 AM GMT
నగర నడిబొడ్డున నయీం గ్యాంగ్ ఆరాచకం
X
గ్యాంగ్ స్టర్ నయీం హతమయ్యాడు. అతడికి సంబంధించి దారుణాలు సీరియల్ మాదిరి రోజూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తవ్వే కొద్దీ వస్తున్న నయీం పాపపు పనులు బయటకు వస్తున్న వేళ.. ఇలాంటి నేరస్తుడ్ని వ్యవస్థ ఎలా భరించిందంటూ ప్రజలు విస్మయానికి గురి అవుతున్న పరిస్థితి. ఇక.. నయీంతో సంబంధాలు ఉన్న నేతలు సైతం.. తాము ఇంతటి దుర్మార్గుడికితో రిలేషన్స్ నడిపామా? అని లోగుట్టుగా అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

నయీం అంతం తర్వాత అతడి అనుచరులు తాత్కాలికంగా కనుమరుగైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే.. అలాంటిదేమీ లేదని.. బరితెగించిన నయీం గ్యాంగ్.. తమ నాయకుడు హతమయ్యాక కూడా దందాలు చేస్తూనే ఉన్నారన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన వివాదంలో తలదూర్చిన నయీం గ్యాంగ్.. తాజాగా నగరం నడిబొడ్డున ఉన్న దిల్ సుఖ్ నగర్ లో చేసిన ఆరాచకం హాట్ టాపిక్ గా మారింది.

ఒక అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు నయిం గ్యాంగ్ కు చెందిన సురేందర్ రెడ్డి 50 మంది మనుషుల్ని తీసుకొచ్చి హంగామా చేయటమే కాదు.. అద్దెకు ఉంటున్న అడ్వకేట్ ను భయాందోళనలకు గురి చేయటం గమనార్హం. తాజా ఉదంతంతో నయీం గ్యాంగ్ ఆరాచకాలకు చెక్ పడలేదని.. పోలీసులంటే ఏ మాత్రం భయం లేనట్లుగా ఉన్నారన్న భావన కలిగేలా చేస్తోంది. ఇక.. ఈ సంచలన విషయానికి వస్తే..

దిల్ సుఖ్ నగర్ లోని మూసారాం బాగ్ లోని ఎస్ బీఐ ఆఫీసర్స్ కాలనీలో రైల్వేశాఖలో డిప్యూటీ పర్సనల్ ఆఫీసర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రావు తన భార్య గంగ పేరు మీద సూర్యోదయ అపార్ట్ మెంట్ లో ప్లాట్ నెంబరు 104ను కొనుగోలు చేశారు. దీన్ని అగ్నిహోత్రం భారతలక్ష్మి అనే అడ్వకేట్ కు అద్దెకు ఇచ్చారు. ఇంతవరకూ ఎలాంటి వివాదం లేదు.

అయితే.. బ్యాంకు నుంచి హౌసింగ్ లోన్ తీసుకొని ఫ్లాట్ కొన్న శ్రీనివాస్ రావు రెండేళ్లుగా వాటి వాయిదాల్ని కట్టటం లేదు. దీంతో.. ఈ ఫ్లాట్ కు సంబంధించి రూ.3లక్షల వరకూ బకాయిలు పేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా సాయం చేసేందుకు అద్దెకు ఉన్న భారత లక్ష్మి.. శ్రీనివాస్ రావు సతీమని గంగ.. వారి కుమారుడు అనిరుధ్ లకు వివిధ దశల్లో మొత్తం రూ.6లక్షలు అప్పు ఇచ్చారు. ఈ మొత్తాన్ని తీర్చకనే.. భారతీలక్ష్మి ఉన్న ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. దీంతో.. తామున్న ఫ్లాట్ ను తామే కొనుగోలు చేస్తామని చెప్పారు. దీనికి శ్రీనివాస్ రావు అంగీకరించకపోవటం.. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి కేసుల వరకూ వెళ్లాయి.

చివరకు ఇరువర్గాల మధ్య రాజీతో ఒక ఫార్ములా తయారు చేశారు. దీని ప్రకారం అద్దెకుంటున్న భారతలక్ష్మి తన పేరిట మౌలాలీలో ఉన్న 340 చదరపు గజాల స్థలాన్ని... శ్రీనివాస్ రావుకు అమ్మితే దానికి ప్రతిగా తాము ఉంటున్న ఫ్లాట్ ను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యలో ఏమైందో కానీ.. ఈ ఒప్పందం తర్వాత శ్రీనివాస్ రావు నయీం అనుచరుడు సురేందర్ రెడ్డి సాయం కోరటంతో.. అతగాడు ఓ 15 మందిని వెంటేసుకొని వచ్చి గత జూన్ లో భారత లక్ష్మిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపి తాళం వేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల ఫిర్యాదుతో ఇంటికి వెళ్లిన నేపథ్యంలో సరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పారిపోయారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా తాజాగా ఆదివారం ఉదయం 50 మందిని వెంటేసుకొని వచ్చిన సురేందర్ రెడ్డి.. సుత్తులతో తలుపులు బద్ధలు కొట్టి.. ఇంట్లో సామాన్లను ధ్వంసం చేసి ఆరాచకం సృష్టించటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఓపక్క నయీం గ్యాంగ్ మీద పోలీసులు ఉక్కుపాదం మోపినట్లుగా వార్తలు వస్తున్న వేళ.. అందుకు భిన్నంగా పట్టపగలు.. ఇంత భారీగా తమ దందా నడపటంపై పోలీసు వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరీ విషయంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్ కౌంటర్ కూడా నయిం మనుషులు ఇంతగా బరితెగించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారి వెనుక అంత అండగా ఉన్నదెవరు? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.