Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర సీఎంకు పెను ముప్పు త్రుటిలో తప్పింది

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:42 AM
ఆ రాష్ట్ర సీఎంకు పెను ముప్పు త్రుటిలో తప్పింది
X
అదేం సిత్రమో కానీ.. వీవీఐపీలు..అందునా రాజకీయ ప్రముఖులు ప్రయాణించే లిఫ్టులు తరచూ మొరాయించటమే కాదు.. అనుకోని ప్రమాదాల కారణంగా రాజకీయ ప్రముఖులు తరచూ గాయపడుతుంటారు. కొద్ది నెలల క్రితం మల్కాజిగిరి ఎమ్మెల్యే ఒక లిఫ్టు ప్రమాదంలో చిక్కుకొని.. కాలికి ఫ్యాక్చర్ కావటమ కాదు.. నెలల తరబడి ఆసుపత్రిలోనూ.. ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి ఉదంతాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలుమార్లు చోటు చేసుకున్నాయి. కట్ చేస్తే.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

తాజాగా ఆయన కాంగ్రెస్ నేత ఒకరు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శ కోసం ఇండోర్ లోని డీఎన్ఎస్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా లిఫ్టులో ఇరుక్కుపోయారు. అంతేకాదు.. హటాత్తుగా లిఫ్టు బలంగా నేలను తాకటంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో.. ఆసుపత్రి సిబ్బందితో పాటు..పలువురు ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మాజీ సీఎం కమల్ నాథ్ ఒక ట్వీట్ ను పోస్టు చేశారు. హనుమంతుడు తన వెన్నంటే ఉండటంతో పెద్ద గండం నుంచి తప్పించుకున్నానని.. అంజనేయుడు తన వెంటే నిత్యం ఉంటాడని పేర్కొన్నారు. కారణం ఎవరైతే కానీ.. సదరు మాజీ సీఎం సేఫ్ గా ఉండటం అందరూ హాయిగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి.