Begin typing your search above and press return to search.

వైసీపీలోకి ఎన్టీఆర్ మామ..జూనియర్ ఎటువైపు?

By:  Tupaki Desk   |   28 Feb 2019 7:44 AM GMT
వైసీపీలోకి ఎన్టీఆర్ మామ..జూనియర్ ఎటువైపు?
X
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గురువారం మధ్యాహ్నం వైసీపీలో చేరారు. కేంద్రమంత్రి కిల్లి కృపారాణితో పాటు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన నార్నే .. విజయసాయి రెడ్డి సమక్షంలో జగన్ ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు..

వైసీపీలో చేరాక నార్నే శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను గత పదేళ్ల నుంచి వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అందుకే ఇప్పుడు చేరానని చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్టు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి టికెట్ ఆశించడం లేదని.. టికెట్ కోసం పార్టీలో చేరలేదని నార్నే స్పష్టతనిచ్చారు. తాను పార్టీకి అవసరం అనుకుంటే జగనే నిర్ణయిస్తాడని తెలిపారు. కానీ పార్టీ బలోపేతానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. పార్టీకి కష్టపడి పనిచేస్తానన్నారు.

నార్నే శ్రీనివాసరావు హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త. స్టూడియో ఎన్ అనే చానెల్ కూడా స్థాపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గర అని పేరుంది. ఆ పరిచయంతోనే చంద్రబాబు సూచనల మేరకు నార్నే శ్రీనివాసరావు తన కూతురును జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చి వివాహం జరిపించారని ఓ టాక్ ఉంది. అయితే చంద్రబాబుకు అంత దగ్గర అయిన నార్నే ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ కూడా టీడీపీకి దూరంగా జరిగినట్టేనా అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

తన మామ నార్నే వైసీపీలో చేరడం.. జగన్ కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించడంతో ఇప్పుడు అల్లుడు - హీరో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఎవరికనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే నార్నే ఈ మాటలపై కూడా మీడియా ఎదుట వివరణ ఇచ్చారు. ‘‘తాను వైసీపీలో చేరడానికి.. తన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని’’ తేల్చిచెప్పారు.