Begin typing your search above and press return to search.

నోటికొచ్చినట్లు మాట్లాడే వారి మీదా చర్యలు తీసుకున్నారే మోడీ?

By:  Tupaki Desk   |   28 Nov 2019 9:11 AM GMT
నోటికొచ్చినట్లు మాట్లాడే వారి మీదా చర్యలు తీసుకున్నారే మోడీ?
X
ఊరికే పరిమితమయ్యేటోడు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇబ్బంది ఆ ఊరోళ్లకే. కానీ.. ఘనత వహించిన ఎంపీలు.. అందునా అధికారపక్షానికి చెందిన వారి నోటి నుంచి వచ్చే మాటల ప్రభావం ఎక్కువే. ఇక.. సాధ్వి లాంటోళ్లు హిందువులను ఉద్దరించటానికే పుట్టినట్లుగా బిల్డప్ ఇచ్చే మహామహులు ఇచ్చే స్టేట్ మెంట్లు అత్యధికుల మీద ప్రభావితం చేస్తుంటాయి. అలాంటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉన్నా.. మాట్లాడని పరిస్థితి.

అలా మాట్లాడే వారి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించే బీజేపీ అధినాయకత్వం ఇచ్చిన అలుసుతో కమలనాథులు పలువురు చెలరేగిపోయే దుస్థితి. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని అంశాల్లో నోరు పారేసుకునే తీరు నేతల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. ఇలాంటి వారి మీద ఘాటు చర్యలు తీసుకుంటే సెట్ అయ్యేది.

కానీ.. అలా ఏమీ చేయని మోడీషాల పుణ్యమా అని సాధ్వి లాంటోళ్లు చెలరేగిపోతుంటారు. తాజాగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపటం తెలిసిందే. జాతిపిత గాంధీను హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడిగా ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఇదో వివాదంగా మారటంతో.. ఇప్పటికే మహారాష్ట్ర ఇష్యూతో బొప్పి కట్టిన మోడీషాలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ లేని రీతిలో ఆమెపై చర్యలు చేపట్టారు.

పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ లో పాల్గొనకుండా నిర్ణయం తీసుకోవటమే కాదు డిఫెన్స్ ప్యానల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరికలు చేశారు. సాధ్వీ వ్యాఖ్యల్ని తమ పార్టీ ఖండిస్తున్నట్లుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగన్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు.

ఈ తరహా వ్యాఖ్యలకు పార్టీ మద్దతు ఇవ్వని నడ్డా వారి మాటలు విన్నప్పుడు.. ఇప్పటివరకూ అదే పనిగా నోరు పారేసుకున్న పలువురు బీజేపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే.. వారి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినట్లా? అన్న డౌట్ రాక మానదు. మరి.. దీనికి కమలనాథులు ఏమని బదులిస్తారు?