Begin typing your search above and press return to search.

మోడీ స‌భ కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   6 July 2018 4:26 PM IST
మోడీ స‌భ కోసం అంత ఖ‌ర్చు చేస్తున్నారా?
X
రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన నిధుల గురించి వ‌డ్డీ వ్యాపారి మాదిరి గీసి గీసీ కోత కోసి మ‌రి నిధులు ఇచ్చే మోడీ స‌ర్కారు.. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పెట్టే ఖ‌ర్చు గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్ర‌ధాని మోడీ పాల్గొనే స‌భ కోసం ఇంత భారీగా ఖ‌ర్చు చేస్తున్నారా? అన్న క్వ‌శ్చ‌న్ రావ‌టం ఖాయం. రేపు (శ‌నివారం) రాజ‌స్థాన్ రాష్ట్ర రాజ‌ధాని జైపూర్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌భ‌కు జ‌నాల్ని తీసుకొచ్చేందుకు రాజ‌స్థాన్ స‌ర్కార్ ఏకంగా రూ.7.23 కోట్లు ఖ‌ర్చు చేయ‌టానికి సిద్ధ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.

రాష్ట్ర ప్ర‌భుత్వ సాధార‌ణ పాల‌నా విభాగం జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌తి పొర‌పాటున మీడియా చేతికి చిక్క‌టంతో ఈ వ్య‌వ‌హారం కాస్తా వెలుగులోకి వ‌చ్చింది. మ‌రికొద్ది నెలల్లో రాజ‌స్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార‌పార్టీగా ఉన్న బీజేపీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నెగిటివ్ ప్ర‌చారానికి చెక్ చెప్పేందుకు వీలుగా భారీ స‌భ‌ల్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఇవి మైలేజీ త‌ర్వాత కొత్త స‌మ‌స్య‌ల్ని తీసుకురావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌ధాని స‌భ‌కు ప్ర‌జ‌ల్ని తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ స‌భ‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల్ని త‌ర‌లించాల‌ని.. అందుకు అయ్యే ర‌వాణా సౌక‌ర్యాల నుంచి ఆహారం.. వ‌స‌తి.. సౌక‌ర్యాల్ని జైపూర్ లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల్ని స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం ప్ర‌భుత్వం 5579 ప్ర‌త్యేక బ‌స్సుల్ని ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ప్ర‌ధాని రాజ‌స్థాన్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ప‌థ‌కాల ల‌బ్థిదారుల‌తో నేరుగా మాట్లాడ‌టానికి .. స్మార్ట్ సిటీస్ పేరిట ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఒక ర్యాలీని ప్లాన్ చేశారు. దీని కోసం ఐదువేల మంది ల‌బ్థిదారుల‌ను పంపాలంటూ జిల్లా క‌లెక్ట‌ర్‌ ను కోరుతూ రాష్ట్ర స‌ర్కారు బ‌ర్మ‌ర్ జిల్లా యంత్రాంగానికి రూ.24 ల‌క్ష‌లు అద‌నంగా పంప‌టం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాని మోడీతో మాట్లాడే మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ ఇవ్వటం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోడీతో నేరుగా మాట్లాడే మ‌హిళ‌ల్నిఎంపిక చేసిన వారికి ఇచ్చిన ట్రైనింగ్ లో వారంతా ప్ర‌శాంతంగా ఉండాల‌ని.. ఎలాంటి తొంద‌ర‌పాటు వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని ట్రైనింగ్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. అయితే.. మోడీతో నేరుగా మాట్లాడే అవ‌కాశం ల‌భించిన ఒక మ‌హిళ త‌నకు అందిన సాయం గురించి ఉన్న‌ది ఉన్న‌ట్లే చెబుతాన‌ని.. అబ‌ద్ధం చెప్ప‌న‌ని చెప్ప‌టంతో ఆమెను జాబితా నుంచి తొల‌గించ‌టం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా.. జైపూర్ లో స‌భ ఏమో కానీ.. మోడీ ఇమేజ్ కు భారీ డ్యామేజ్ జ‌రిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.