Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ ఎజెండా మోడీ సెట్‌ చేస్తారా?

By:  Tupaki Desk   |   15 April 2015 11:54 AM IST
అంతర్జాతీయ ఎజెండా మోడీ సెట్‌ చేస్తారా?
X
ఇంతకాలం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన ప్రధాని మోడీ.. ఇప్పుడు అంతర్జాతీయంగా తానొక బ్రాండ్‌గా బలపడాలని భావిస్తున్నారా? విదేశీ వ్యవహారాల విషయంలో భారతదేశ ప్రధానుల్లో పలువురు బలహీన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా ఆయన చురుగ్గా వ్యవహరిస్తూ.. అంతర్జాతీయంగా ఆయన ఇప్పుడు ఒక చర్చగా మారుతున్నారు.

ప్రధానమంత్రి అయిన నాటి నుంచి విదేశాంగ వ్యవహారాల విషయంలో మోడీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టటమే కాదు.. అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున నాయకత్వం వహించేందుకు ఆయన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రపంచబ్యాంక్‌కు ప్రత్యామ్నాయంగా కాకున్నా.. అదే తరహాలో కొన్ని దేశాలతో కలిపి బ్యాంకును ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విషయాన్ని మర్చిపోకూడదు.

తాజాగా పర్యావరణ అంశాన్ని ప్రస్తావిస్తున్న మోడీ.. అభివృద్ధి చెందిన దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని ఆయన వివిధ వేదికల మీద ప్రస్తావిస్తున్న ఆయన తాజాగా.. అభివృద్ధి చెందుతున్న.. వెనుకబాటుకు గురైన దేశాల తరఫున తాను గళం విప్పుతానన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్న ఆయన.. భారతసంతతి చేసిన సన్మాన కార్యక్రమం అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.

భారత్‌ విడిచే ఉద్గారాల కారణంగా భూతాపం పెరిగిపోతుందంటూ అభివృద్ధి చెందిన దేశాలు ఆరోపించటాన్ని ఆయన తీవ్రస్థాయిలో ఖండించటమే కాదు.. చేయాల్సిన తప్పులన్నీ అభివృద్ధి చెందిన దేశాలు చేసేసి.. తమపై ఆరోపణలు చేయటంలో అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా తమ ప్రభుత్వం గురించి.. తమ పాలనా విధానాల గురించి ప్రస్తావించి.. భారత్‌ను ఏ దిశగా తీసుకెళుతున్నామో చెప్పుకునే ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ అంశాల మీద దృష్టి పెడుతున్నారు. భూతాపానికి ధనికదేశాల వైఖరే కారణమంటూ ఆయన గళం విప్పుతున్నారు. ఇదొక్క విషయమే కాదు.. అంతర్జాతీయ టెర్రరిజానికి సంబంధించిన కీలక ప్రశ్న ఒకటి సంధించారు.

ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు ఎలా వస్తున్నాయంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు అమ్మే విషయంలో దేశాలు నియంత్రణ పాటిస్తే వారిని ఎదుర్కొవటం కష్టమేమీ కాదని ఆయన చెప్పుకొచ్చారు. తాజా పర్యటనలో ఉగ్రవాదులకు ఆయుధాలు అందుతున్న విషయంతో పాటు.. భూతాపం గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు అంతర్జాతీయ వేదికలపై మోడీ కీలకభూమిక పోషించాలని తాపత్రయ పడుతున్న విషయంఇట్టే అర్థమవుతుంది.

అంతేకాదు.. సెప్టెంబరులో ప్యారిస్‌లో జరిగే వాతావరణ మార్పులపై జరిగే శిఖరాగ్ర సభల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాను భారత్‌ నిర్దేశించనున్నదంటూ తాను ఎంత కీలకంగా మారనున్నానన్న విషయాన్ని మోడీ చెప్పుకొచ్చారు. ఏడాది కిందటి వరకూ గుజరాత్‌ వరకే పరిమితమైన మోడీ.. తనకొచ్చిన అవకాశంతో ప్రపంచ వ్యాప్తంగా తన ముద్రను వేసేందుకు తహతహలాడుతున్న విషయం అర్థమవుతుంది. ఈ తహతహ మంచిదే అయినా.. దేశ ప్రజలు కోరుకున్న మార్పు మీద కూడా ఇలాంటి ముద్రే వేస్తే బాగుంటుందేమో.