Begin typing your search above and press return to search.

ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   15 Aug 2019 5:18 AM GMT
ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ ఏం చెప్పారు?
X
ఈ రోజు 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని కొత్త తరహా వేడుకలుగా ఈసారివి చెప్పక తప్పదు. ఎందుకంటే.. జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగా.. ఇప్పుడా రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోవటమే కాదు.. ఇప్పటివరకూ కశ్మీరీలకు ఉండే ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం.. చట్టం రూపంలో రాష్ట్రపతి సంతకం చేయటం తెలిసిందే.

కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవం కావటంతో.. ఎర్రకోట సాక్షిగా మోడీ ఏం మాట్లాడనున్నారు? ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? అన్న ఆసక్తి వ్యక్తమైంది. దీనికి తోడు పాక్ దేశాధ్యక్షుడు.. ప్రధాని హోదాల్లో ఉన్న వారు తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. యుద్దానికైనా తాము సిద్ధమన్నట్లుగా చేసిన ప్రకటనలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వారి వ్యాఖ్యలకు మోడీ ఎలా కౌంటర్ ఇవ్వనున్నారు? ఆయనేం మాట్లాడనున్నారన్న ఉత్కంట ఎదురైంది. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం (గురువారం) ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు మోడీ. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెల్లటి లాల్చీ ఫైజమాకు బ్రౌన్ కలర్ చుక్కలున్న పసుపు రంగుతో కూడిన కండువాను వేసుకోవటంతో పాటు.. ఎరుపు.. పసుపు.. ఆకుపచ్చ వర్ణాలతో కలిసి ఉన్న తలపాగాను ధరించిన ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

% ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం. శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మాకు అవకాశం ఇచ్చారు. వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తాం.

% ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. అందులో భాగంగానే ఆర్టికల్‌ 370,35ఏ రద్దు చేశాం. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలలను నెరవేర్చాం. వ్యవస్థలను గాడిలో పెట్టాం. వేగవంతంగా పని చేసేలా ముందుకెళ్తున్నాం.

% సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌శక్తి అభియాన్‌ ఏర్పాటు చేశాం. వైద్యారోగ్య రంగంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌ దేశ ప్రజలకు వరం వంటిది. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి తేవాలన్నదే మా లక్ష్యం. వచ్చే ఐదేళ్లు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం.

% రెండో సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తలాక్‌ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు సాధికారత కల్పించాం. రాజ్యాంగ స్ఫూర్తితో ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం.

% 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం. ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నాం. అడ్డంకులు అధిగమించి ముందుకు సాగుతున్నాం.

% ఒక దేశం ఒకే రాజ్యాంగం నా ధ్యేయం. దేశ భవిష్యత్తే నాకు ముఖ్యం. నా రాజకీయ భవిష్యత్‌ అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ఒకే రాజ్యాంగాన్ని సాధించాం. త్వరలోనే వన్‌ నేషన్‌-వన్‌ పోల్‌ సాకారమవుతుంది.

% 2014 ఎన్నికలకు ముందు దేశమంతా పర్యటించా. అన్ని వర్గాల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశా. అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టాం. దేశం మారుతోందన్న భావన అందరిలోనూ ఉంది. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.

% వరదలతో... ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.

% ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నాం. అడ్డంకులకు అధిగమించి ముందుకు సాగుతున్నాం. శ్రేష్ట్‌ భారత్‌ కోసం నిరంతరం కృషి చేస్తాం. రాజకీయాలు ఎన్నికలకు మాత్రమే పరిమితం. దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. గత ప్రభుత్వాలు పేదలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి.

% పేదలకు ఇప్పటికీ విద్యుత్‌, టాయిలెట్స్‌, తాగునీటి వసతి లేదు. తాగునీటి కోసం నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తాగునీటి సౌకర్యం కోసం రూ.3.50 లక్షల కోట్లతో జల్‌జీవన్‌ మిషన్‌‌ను ఏర్పాటు చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జల్‌జీవన్‌ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం.

% ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో జల్‌జీవన్‌ మిషన్‌ను ఏర్పాటు చేస్తాం.

% సులభతర వాణిజ్యమే (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కాకుండా సులభతర జీవనం (ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌) కూడా అవసరం. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ అన్ని రంగాల్లో దూసుకుపోయేలా హైజంప్‌ చేయాల్సిన అవసరం ఉంది.

% రోజులు మారుతున్నాయని అందుకు తగ్గట్టుగా మనం మారాలి. సంపద సృష్టితోనే సమస్యలు దూరమవుతాయి. దేశ మౌలిక రంగంలో కోటి కోట్ల పెట్టుబడులు పెడతాం.

% దేశం కోసం చనిపోయే అవకాశం నాకు లభించలేదు. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటీషర్లతో పోరాడే సమయానికి నేను పుట్టలేదు. దేశం కోసం మరణించే అవకాశం లభించలేదు. అయితే.. దేశం కోసం మరణించే అవకాశం దొరక్కపోయినా.. దేశం కోసం జీవితం అవకాశం లభించింది.

% నాటి అమరుల త్యాగాలు దేశానికి ఎప్పటికీ ఆదర్శమే. వారిని తలుచుకుంటే గర్వంగా ఉంటుంది. స్వరాజ్య సంగ్రామం ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. వారి త్యాగాలపైనే నేటి భారతం నిర్మితమైంది. మహాత్మగాంధీ - అంబేద్కర్ జీవితాలు నేటి భారతానికి ఆదర్శాలు. వారి అడుగుజాడల్లో నడుద్దాం.