Begin typing your search above and press return to search.

స్విస్ లిస్ట్ అందింది... మోదీ చర్యలు మొదలెడతారా?

By:  Tupaki Desk   |   8 Oct 2019 1:30 AM GMT
స్విస్ లిస్ట్ అందింది... మోదీ చర్యలు మొదలెడతారా?
X
2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దేశ సంపదను దోచేసి విదేశాలకు తరలించిన నల్ల కుబేరుల పనిబడతానంటూ నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇప్పటికీ దేశ ప్రజల చెవుల్లో రింగురింగుమంటూనే ఉంది. ఆ ఎన్నికల్లో మోదీ మాటను నమ్మిన జనం బీజేపీకి పట్టం కట్టారు. అనుకున్నట్లుగానే నల్ల కుబేరుల పనిబట్టేందుకు చర్యలు మొదలెట్టిన మోదీ సర్కారు.. స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచుకున్న వారి జాబితా ఇవ్వాలంటూ స్విట్జర్లాండ్ ను కోరింది. ఈ దిశగా దశలవారీగా జరిగిన చర్చలు ఫలించాయి. ఇటీవలే ఆ జాబితాను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన స్విస్ అధికారులు... తాజాగా తొలి జాబితాను మోదీ చేతిలో పెట్టేశారు. మరి ఆ జాబితాలోని నల్ల కుబేరుల భరతం పట్టే పనిని మోదీ ఎప్పుడు మొదలెడతారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలకు తెర లేసింది.

స్విస్ బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయల భారత డబ్బు పోగైపోయింది. భారత్ లో వివిధ మార్గాల ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనను దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గుట్టు చప్పుడు కాకుండా స్విస్ బ్యాంకులకు తరలించేసిన వైనంపై కథలు కథలుగా చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ కథలన్నీ బహిర్గతమైపోయే సమయం ఆసన్నమైపోయింది. నల్ల కుబేరులుగా మారి దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలించిన చాలా మంది పేర్లతో కూడిన జాబితా ఇప్పుడు మోదీ సర్కారు చేతికందింది. ఈ జాబితాలో భారత పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు కీలక వ్యక్తులతో పాటు విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ జాబితాను పరిశీలించి చర్యలు తీసుకునేలోగానే వచ్చే ఏడాదిలో రెండో జాబితా కూడా అందజేస్తామని స్విస్ అధికారులు చెప్పారట.

సరే... ఇప్పటిదాకా స్విస్ నుంచి వివరాలు రాలేదని, ఆ వివరాలు రాగానే చర్యలు మొదలెడతామని మోదీ సర్కారు చెబుతూ వస్తోంది కదా. అలాంటిది ఇప్పుడు జాబితా చేతికందని నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరింత జాప్యాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. మరి ప్రజల మనోభావాల మేరకు దేశ సంపదను దోచేసిన నల్ల కుబేరుల పనిబట్టే కార్యక్రమానికి మోదీ ఎప్పుడు శ్రీకారం చుడతారన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. మోదీ హయాంలోనే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ... తదితర మోసగాళ్లు దేశం దాటిపోయారు. మరి ఈ జాబితాను అయినా పరిశీలించి చర్యలు మొదలెడితే మోదీ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది. చూద్దాం.. మరి మోదీ ఈ జాబితాను ఏం చేస్తారో?

భద్రతకు, గోప్యతకు మారుపేరుగా నిలిచే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డబ్బు, బంగారం దాచుకోవడం ఈనాటిది కాదు. అయితే, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు సరైన లెక్కలు చూపకపోతే అది నల్లధనం కిందే లెక్క! ఇలాంటి ఖాతాలు లెక్కకు మిక్కిలి ఉన్నట్టు గత ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించినా, ఆ నల్లధనాన్ని స్వదేశానికి చేర్చే ప్రక్రియ మోదీ హయాంలో ఊపందుకుంది.

తాజాగా, స్విస్ బ్యాంకుల్లో తమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం భారత్ కు అందినది మొదటి జాబితాగా భావిస్తున్నారు. ఈ జాబితాలో అనేకమంది వ్యాపారవేత్తలు, ఎన్నారైలు ఉన్నట్టు గుర్తించారు. 2018లో అనేకమంది తమ ఖాతాలు మూసివేసినట్టు తాజా జాబితా ద్వారా వెల్లడైంది. ప్రస్తుతానికి తొలి జాబితా అందించామని, వచ్చే ఏడాది మరికొందరి పేర్లతో తదుపరి జాబితా అందజేస్తామని ఓ అధికారి తెలిపారు.