Begin typing your search above and press return to search.

`ఐఎన్ ఎస్ క‌ల్వ‌రి`తో చైనాకు చెక్

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:00 PM IST
`ఐఎన్ ఎస్ క‌ల్వ‌రి`తో చైనాకు చెక్
X
భార‌త నేవీ అమ్ముల పొదిలో మ‌రో స‌బ్ మెరైన్ చేరింది. అధునాత‌న సాంకేతిక‌త‌తో రూపొందించిన మేడిన్‌ ఇండియా స్కార్పియన్‌ జలాంతర్గామి `ఐఎన్‌ ఎస్‌ కల్వరి` నేవీలో భాగ‌మైంది. గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో అత్యాధునిక అణు ర‌హిత స‌బ్ మెరైన్ ఐఎన్‌ ఎస్‌ కల్వరిని నౌకాదళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించారు. అనంత‌రం దానిని జాతికి అంకితం చేశారు. భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక నిదర్శనమ‌న్నారు. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ `ఫ్రాన్స్‌ నావల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎనర్జీ కంపెనీ` డిజైన్‌ ఆధారంగా కల్వరీ నిర్మాణం జరిగింది. ఆ సంస్థ స‌హ‌కారంతో ఐఎన్‌ ఎస్ కల్వరిని ముంబైలోని మాజగాన్‌ డాక్‌ యార్డ్‌ లో నిర్మించారు. హిందూ మహా సముద్రం‍లో విదేశీ యుద్ధనౌకలను కల్వరితో నియంత్రించ‌వ‌చ్చు. ముఖ్యంగా భార‌త స‌ముద్ర జ‌లాల్లోకి అడ్డు అదుపు లేకుండా దూసుకు వ‌స్తున్న చైనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నేవీ అధికారులు భావిస్తున్నారు.

భార‌త నౌకాద‌ళం చేప‌ట్టిన `ప్రాజెక్ట్ -75`లో భాగంగా 6 సబ్‌ మెరైన్ల‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వంతో మాజ‌గాన్ డాక్ యార్డ్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన 5 స‌బ్ మెరైన్ల‌ను 2020 నాటికి నేవీకి అప్ప‌గించ‌నుంది. 1.566 టన్నుల బరువైన ఈ సబ్‌ మెరైన్ 67.5 మీట‌ర్ల పొడ‌వు - 12.3 మీట‌ర్ల ఎత్తు క‌లిగి ఉంది. అధునాత‌న శ‌బ్ద‌ర‌హిత డీజిల్ మోట‌ర్ ను క‌లిగి ఉన్న ఈ స‌బ్ మెరైన్ ను చైనా వంటి శ‌త్రు దేశాల స‌బ్ మెరైన్ లు ప‌సిగ‌ట్ట‌లేవు. అంతేకాకుండా, సముద్ర మార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదులకు - డ్రగ్స్ రవాణా - అక్రమ చేపల వేటను నిలువ‌రించ‌నుంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ - భారత నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబ - మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు - మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ - భారత నావికాదళ సీనియర్ అధికారులు - ఫ్రాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.