Begin typing your search above and press return to search.

మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   3 Nov 2016 10:21 AM IST
మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారా?
X
ఉరీ ఉగ్రదాడి - భారత్ సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం భారత్-పాక్‌ మధ్య సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఎంత స్నేహ హస్తం అందినా - శాంతి మాటలు వినిపించినా మాట వినని పాక్... భారత్ మంచి తనాన్ని చేతకాని తనంగా భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి కుక్కతోక వంకర బుద్దిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఇప్పటికే సైన్యం కారాలూ మిరియాలూ నూరుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నారని - సరిహద్దులో ఉద్రిక్తత క్రమంగా పెరుగుతుండటం, ఇరు సేనల మధ్య కాల్పులు జోరందుకోవడం, ఇదే క్రమంలో పాక్‌ కాల్పుల్లో సాధారణ ప్రజలూ మరణిస్తుండటంతో మరోసారి "గీత"దాటి సర్జికల్‌ దాడులు చేసి పాక్‌ కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని మోడీ సర్కారు భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

పాకిస్థాన్‌ పద్దతేం బాగాలేదు - అప్రకటిత కాల్పులతో వారి అల్లరి రోజు రోజుకీ పెరిగిపోతుంది.. భారత పౌరులే లక్ష్యంగా దాడులు జరుపుతోంది.. ఇక ఉపేక్షించడం వల్ల ఏమాత్రం లాభం లేదు.. మరోసారి ఇంకాస్త బలంగా సర్జికల్‌ దాడులు జరపాల్సిందే.. ఆ దాడులు ఎలా ఉండాలంటే... ఈసారి కోలుకోలేని స్థాయిలో ఉండాలి.. అని భారత ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారని, ఈ మేరకు సరిహద్దుల్లో పాక్‌ సైనికుల ఆగడాలపై మోడీ నివాసంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే మోడీ చాలా సీరియస్ గా స్పందించారని, పాక్ తాట తీయాల్సిందేనని వ్యాఖ్యానించారని కథనాలొస్తున్నాయి.

ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌ లోని రాంగఢ్‌ - సాంబా - పూంచ్‌ - రాజోరీ సెక్టార్‌ లలో వారం రోజులుగా పాక్‌ కాల్పులకు తెగబడుతున్న వైనంపై పారికర్ ప్రధానికి నివేదిక అందజేశారట. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మరణించగా - సుమారు 25 మందికి పైగా గాయాలపాలయ్యారని తెలిపారట. ఈ విషయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోడీ... పరిస్థితి చేయి దాటకముందే ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని - సర్టికల్‌ దాడుల్లా మరోసారి విరుచుకుపడితే ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారని తెలుస్తోంది. ఈసారి సరిహద్దు వెంట ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడమే కాక పాక్‌ ఆర్మీ పోస్టులపై కూడా ఒక చేయి వేయాలని, ఆ దిశగాపథకాన్ని రచించాలని సూచించినట్లు తెలుస్తోంది.

సర్జికల్‌ దాడుల అనంతరం ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేలా సహకరించడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిత్యం ఉల్లంఘించడం లాంటి చర్యలకు పాల్పడం వంటి విషయాలు చికాకు తెప్పిస్తున్నాయని, ఈసారి పాకిస్తాన్‌ కు గట్టిగానే బుద్ధి చెబితే బాగుంటుందని ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌ కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో... పకడ్భందీ వ్యూహంతో పాకిస్తాన్‌ ను కోలుకోలేని దెబ్బతీయాలని అందుకు సైన్యాన్ని సిద్ధం చేయాలని ప్రధాని సూచించారట. ఈ మేరకు అజిత్ దోవల్‌ కు బాధ్యతలను అప్పగించారట. అయితే ఈసారి కూడా సర్జికల్‌ దాడులే జరుపుతారా? లేక మరో వ్యూహంతో బుద్ది చెబుతారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/