Begin typing your search above and press return to search.

మోదీ పిలుపు..గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న లాంటిదేనా?

By:  Tupaki Desk   |   9 Jan 2018 3:37 PM IST
మోదీ పిలుపు..గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న లాంటిదేనా?
X
ఏపీలో ఇప్పుడు విచిత్ర రాజ‌కీయం చోటుచేసుకుంటోంది. గ‌డ‌చిన కొంత కాలంగా వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలించిన ఏ ఒక్క‌రికైనా ఈ విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ... కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామి. ఎన్డీఏ ర‌థ‌సార‌థిగా ఉన్న బీజేపీకి టీడీపీ ఆప్త మిత్రుడి కిందే లెక్క‌. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఒక్క క‌ర్ణాట‌క మిన‌హా మిగిలిన ఏ ఒక్క రాష్ట్రంలోనూ గ‌ట్టి పునాది లేని బీజేపీకి ఏపీలో టీడీపీతో దోస్తీ నిజంగానే వ‌రంగానే ప‌రిగ‌ణించాలి. ఈ భావ‌న బీజేపీలోనూ ఉన్నా... గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీ ప్ర‌భంజ‌నంతో ఎన్డీఏలోని మిత్ర‌ప‌క్షాల స‌హాయం లేకుండా తానే ఒంట‌రిగా మెజారిటీ సాధించిన నేప‌థ్యంలో ఇప్పుడు ఆ పార్టీలో ఆ భావ‌న దాదాపుగా క‌నుమ‌రుగైంద‌నే చెప్పాలి. అంటే.. కేంద్రంలో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగిన తాము... భవిష్య‌త్తులో ఏపీలోనూ ఇత‌ర రాజ‌కీయ పార్టీ తోడ్పాటు లేకుండానే ఎద‌గ‌గ‌ల‌మ‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల అభిప్రాయంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందులో ఎంత‌మేర వాస్త‌వ‌ముంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... ఇప్పుడు బీజేపీ - టీడీపీ ప్ర‌త్యేకించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుల మ‌ధ్య పెరిగిన దూరం గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించుకోవాల్సిందే.

ఎందుకంటే ఏపీ జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ వ్య‌యం మొత్తం త‌న‌దేన‌ని బీజేపీ స‌ర్కారు పార్ల‌మెంటు సాక్షిగానే ప్ర‌క‌టించింది. అయితే ఆ ప‌నుల‌ను తామే చేప‌డ‌తామ‌ని చంద్ర‌బాబు రాయ‌బారం న‌డ‌ప‌డం - అందుకు మోదీ స‌ర్కారు కూడా స‌మ్మ‌తించ‌డం, ఆ త‌ర్వాత పెరిగిన ధ‌ర‌ల మేర‌కు నిర్మాణ వ్య‌యాన్ని పెంచ‌డం కుద‌ర‌ద‌ని మోదీ తేల్చి చెప్ప‌డం - ఆ త‌ర్వాత క్ర‌మంతో ఈ వాద‌న‌ను ప‌క్కన పెట్టేసిన మోదీ స‌ర్కారు... పెరిగిన అంచ‌నాల మేర‌కు నిధులు విడుద‌ల చేసేందుకు అయిష్టంగానే ఒప్పేసుకుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంతా బాగానే ఉన్నా త్వ‌రిత‌గ‌తిన నిర్దేశిత గ‌డువులోగా పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయితే అది టీడీపీతో పాటుగా బీజేపీకి కూడా బాగానే క‌లిసి వ‌చ్చే అంశ‌మేన‌ని చెప్పాలి. మ‌రి అలాంట‌ప్పుడు పోల‌వ‌రం నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధుల విడుద‌ల‌లో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తున్న‌ట్లు? పోల‌వ‌రంలో కీల‌క నిర్మాణంగా ప‌రిగ‌ణిస్తున్న కాఫ‌ర్ డ్యాంను ఎందుకు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు? పోల‌వ‌రం ప‌నుల‌ను విభ‌జించి ప్రాజెక్టు త్వ‌రిత‌గ‌తిన పూర్తి అయ్యేలా టెండ‌ర్లు పిలిస్తే... వాటికి కేంద్రం మోకాలొడ్డటం ఎందుకు? నిజంగా ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న బీజేపీ - టీడీపీల మ‌ధ్య బెడిసికొట్టిన సంబంధాల నేప‌థ్యంలోనే ఈ ప‌రిణామాల‌న్నీ చోటుచేసుకుంటున్నాయ‌న్న వాద‌న అయితే ఒక‌టి ఉంది.

ఈ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను తాను స్వ‌యంగా ప‌రిశీలిస్తాన‌ని, త్వ‌ర‌లోనే అక్క‌డికి వ‌స్తాన‌ని చెప్పిన కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ... అస‌లు అటువైపు ఎందుకు క‌న్నెత్తి చూడ‌లేదు? గ‌డ్క‌రీ అదుగో వ‌స్తున్నారు... ఇదుగో వ‌స్తున్నారు అంటూ చంద్ర‌బాబు స‌ర్కారు బాకాలు ఊద‌డం త‌ప్పించి గ‌డ్క‌రీ పోల‌వ‌రం ద‌గ్గ‌ర‌కు మాత్రం రానే లేదు. ఈ విష‌యం చంద్ర‌బాబును నిజంగానే బాగా ఇబ్బందిపెట్టింద‌నే చెప్పాలి. ఎందుకంటే... పోల‌వ‌రం ప‌రిశీల‌న‌కు వ‌స్తాన‌ని గ‌డ్క‌రీ చెప్పింది చంద్ర‌బాబుకే కాబ‌ట్టి. స‌రే ఇది గ‌తించిన అంశ‌మే అనుకున్నా... ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో చంద్ర‌బాబు భేటీపైనా టీడీపీ - ప్ర‌త్యేకించి స్వ‌యంగా చంద్ర‌బాబే మ‌రోమారు బాకాలు ఊదే ప‌నికి శ్రీ‌కారం చుట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొన్న ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు త‌న‌ను క‌లిసిన సంద‌ర్భంగా మోదీ నోట నుంచి చంద్ర‌బాబుతో బేటీ అన్న మాట వినిపించింద‌ట‌. అది కూడా నేరుగా మోదీ నోట నుంచి కాకుండా టీడీపీ ఎంపీ - కేంద్ర మంత్రిగా ఉన్న వైఎస్ చౌద‌రి నోట నుంచి ఈ మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఆ త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను చూస్తే.... మోదీతో చంద్ర‌బాబు భేటీ కూడా... పోల‌వ‌రానికి నితిన్ గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న లాగే మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న కొత్త వాద‌న ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది.

ఈ నెల 12న తాను ఢిల్లీకి వ‌స్తాన‌ని చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ పంపారు. ఆ లేఖ‌ను ప‌రిశీలించిన ప్ర‌ధాన‌మంత్రిత్వ కార్యాల‌యం మాత్రం దానిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న అయితే వెలువ‌రించ లేదు. ఈ నెల 12న రావ‌ద్ద‌ని - సంక్రాంతి అయిపోయిన త‌ర్వాత చూద్దామంటూ మోదీ అపాయింట్‌ మెంట్‌ పై త‌న‌దైన శైలిలో స్పందించింది. 12న కాకుంటే... ఈ నెల 17న మోదీతో భేటీ అవుతాన‌ని స్వ‌యంగా చంద్ర‌బాబే ఇప్పుడు చెబుతుంట‌డం మ‌రింత అనుమానాల‌కు తావిస్తోంది. ఎందుకంటే... 17న రావాల‌ని పీఎంఓ చెప్ప లేదు క‌దా. అంతేకాకుండా చంద్ర‌బాబు ప్ర‌తిపాదించిన ఓ డేట్‌ ను పీఎంఓ వ‌ద్ద‌ని చెప్పింది కూడా. మ‌రి అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు త‌న‌కు తానుగా ఈ నెల 17న తాను మోదీతో భేటీ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని ఎలా చెబుతారు? స‌ంక్రాంతి త‌ర్వాత అంటే... 17 మాత్ర‌మే ఉందా? ఆ తేదీతో పాటుగా ఇంకా లెక్క‌లేన‌న్ని తేదీలు ఉన్నాయి. ఇన్నేసి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో మోదీతో భేటీ కూడా గ‌డ్కరీ పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లా మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా మిత్ర‌ప‌క్ష పార్టీ అధినేత‌గానే కాకుండా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబుకు మోదీ అపాయింట్‌ మెంట్‌ పై ఇంత‌గా ప్ర‌చారం చేసుకోవాలా? అన్న డౌట్లు కూడా ఇప్పుడు వెల్లువ‌లా వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీతో భేటీకి సంబంధించి కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేదాకా కూడా ఆగ‌లేని చంద్ర‌బాబు.. మోదీ నోట నుంచి ఓ మాట వ‌చ్చింద‌ని ఓ తెలుగు త‌మ్ముడు చేసిన ప్ర‌క‌ట‌న‌తోనే ఇంత‌గా చంక‌లు గుద్దుకోవ‌డం ఎందుక‌న్న ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?