Begin typing your search above and press return to search.

జగన్ వద్దకు నన్నపనేని...టీడీపీకి షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   28 May 2019 4:11 AM GMT
జగన్ వద్దకు నన్నపనేని...టీడీపీకి షాక్ తప్పదా?
X
ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి వరుస దెబ్బలు తప్పేలా లేవన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఓటమి బాధతో కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ దిశగానే మరికొందరు నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఇక టీడీపీ హయాంలో కొలువుదీరిన పలు పాలకవర్గాలు వాటికవే రాజీనామాలు చేసేస్తున్నాయి. ఎప్పుడు ప్రభుత్వం మారినా... ఈ తరహా పరిణామాలు సాదారణమే కానీ... ఇప్పుడు జరుగుతున్న రాజీనామాలు చూస్తే మాత్రం టీడీపీకి బారీ ఎదురు దెబ్బలే తగిలేలా కనిపిస్తున్నాయి.

తాజాగా టీడీపీ సీనియర్ మహిళా నేత - ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న నన్నపనేని రాజకుమారి సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. జగన్ తో భేటీ కోసమే ఆమె అక్కడకు వచ్చారట. ఈ వార్త తెలియగానే టీడీపీలో కలకలం రేగింది. అయితే ఇవేమీ పట్టించుకోని నన్నపనేని... జగన్ తో భేటీ కోసమే వచ్చినట్టుగా చెప్పారు. అయితే నన్నపనేని అక్కడికి వెళ్లేలోగానే... జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారట. దీంతో చేసేదేమీ లేక ఆమె అక్కడి నుంచి వెనుదిరిగాట.

నన్నపనేని కూతురు - అల్లుడు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే వారేమీ ఆమె వెంట కనిపించలేదు. తాను ఒంటరిగానే జగన్ కార్యాలయం వద్దకు నన్నపనేని వెళ్లినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో కీలక నేతగా ఉన్న నన్నపనేని... జగన్ తో బేటీ కోసం అక్కడికెళ్లారన్న వార్త ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో నిరాశగానే వెనుదిరిగిన నన్నపనేని... జగన్ ఇడుపులపాయ - తిరుమల పర్యటనలను ముగించుకుని వచ్చిన తర్వాత ఆయనను కలిసేందుకు మరోమారు తాడేపల్లికి వెళతారట. మరి ఈ వార్తలపై ఇప్పటికే కలవరపడుతున్న టీడీపీ... నన్నపనేని తీరుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.