Begin typing your search above and press return to search.

నంద్యాల సూసైడ్ కేసులో ఆ లాయర్ ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు

By:  Tupaki Desk   |   12 Nov 2020 11:45 AM IST
నంద్యాల సూసైడ్ కేసులో ఆ లాయర్ ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు
X
ఏపీలో సంచలనంగా మారిన నంద్యాల సలాం ఫ్యామిలీ ఆత్మహత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దొంగతనం ఆరోపణలు చేస్తూ.. వేధిస్తున్న పోలీసుల తీరుకు తట్టుకోలేక.. కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటం..దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చి సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విచారణకు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ.. కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 24 గంటల్లో సదరు సీఐ.. కానిస్టేబుల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ మంజూరు కావటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి సైతం స్పందించి.. బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించటం కూడా జరిగిన సంగతి తెలిసిందే.

నాన్ బెయిల్ బుల్ కేసులో బెయిల్ రావటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ.. కానిస్టేబుల్ తరఫున బెయిల్ కోసం వాదనలు వినిపించిన లాయర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావటంతో కొత్త చర్చ మొదలైంది. దీంతో న్యాయవాది రామచంద్రరావు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే.. నేరారోపణ ఎదుర్కొంటున్న సీఐ.. కానిస్టేబుల్ కు బెయిల్ కోసం వాదించిన లాయర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావటంతోనే బెయిల్ వచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఏపీ అధికారపక్ష నేతలు పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం. తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేయటంతో పాటు.. సీఐ.. కానిస్టేబుల్ తరపున వాదించేందుకు సైతం విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు.