Begin typing your search above and press return to search.

పవన్ లేనప్పుడు ప్రెస్‌ మీట్లు..నాదెండ్ల మనోహర్ లెక్కేంటి?

By:  Tupaki Desk   |   28 Dec 2018 3:30 PM GMT
పవన్ లేనప్పుడు ప్రెస్‌ మీట్లు..నాదెండ్ల మనోహర్ లెక్కేంటి?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐరోపా పర్యటనలో బిజీగా ఉన్నారు. దాంతో పార్టీ కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ.. కొన్నాళ్లుగా పవన్ వెన్నంటే అన్నిచోట్లకు తిరుగుతున్న నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పవన్ పరోక్షంలో పార్టీ సంగతులు చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చూడడమే కాదు.. పార్టీకి సంబంధించి కీలక ప్రకటనలూ ఆయనే చేస్తుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని.. మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రస్తుతం జనతరంగం కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే జనసేన కార్యాచరణను ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

అయితే.. ఇదంతా బాగానే ఉన్నా పవన్ ఉన్న సమయంలో ఆయన వెంట మౌనంగా కనిపించే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ యాక్టివేట్ కావడంపై ఆ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నాదెండ్ల మనోహర్‌ కు సంబంధించి సంచలన ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచినట్లే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని.. పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో పవన్ లేని సమయంలో నాదెండ్ల మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండడం పార్టీలో చర్చనీయంగా మారింది.