Begin typing your search above and press return to search.

శ్రీవారికి 300 కోట్లు విరాళం .. ముంబై భక్తుడి ఔదార్యం..!

By:  Tupaki Desk   |   13 March 2021 4:57 AM GMT
శ్రీవారికి 300 కోట్లు విరాళం .. ముంబై భక్తుడి ఔదార్యం..!
X
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించడం.. ముడుపులు కట్టడం మామూలే. కానీ ఓ భక్తుడు ఏకంగా రూ. 300 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ డబ్బుతో 300 పడకల ఆస్పత్రిని నిర్మించాలని కోరారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డితో ఎంవోయూ చేసుకున్నారు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ముంబైకి చెందిన సంజయ్​ సింగ్​ అనే భక్తుడు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 300 కోట్లు స్వామివారికి కానుకగా సమర్పించబోతున్నట్టు ప్రకటించాడు. ఈ డబ్బుతో తిరుపతిలో ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఆయన కోరారు. ఏడుకొండల వాడికి కానుకలు, విరాళాలు సమర్పించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పుడప్పుడు కొందరు భక్తులు భారీ విరాళం చెల్లిస్తుంటారు.

నిన్న ముంబైకి చెందిన సంజయ్​ సింగ్​ భారీగా విరాళం ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సందర్భంగా సంజయ్ ​సింగ్​ ను టీటీడీ అధికారులు, చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి అభినందించారు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు. గురువారం 49వేల 707 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.99 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. 21వేల 638 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

కరోనా తగ్గుముఖం పట్టాక తిరుపతికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శని, ఆదివారాల్లో సైతం రద్దీ మరింత ఎక్కువగానే ఉంటుంది. టీటీడీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

శ్రీవారికి భారీగా విరాళం ప్రకటించిన సంజయ్​ కే సింగ్ ముంబైలో పెద్ద వ్యాపారి అని సమాచారం. ఆయన అద్వైత్ ఇన్‌ఫ్రాస్చ్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ అనే కంపెనీకి యజమాని. ఈ కంపెనీని ఆయన 2017లో ప్రారంభించినట్టు సమాచారం. ఆయనకు భారీగా లాభాలు రావడంతో ప్రస్తుతం శ్రీవారికి విరాళం ప్రకటించారు. గతంలోనూ పలువురు భక్తులు శ్రీవారికి భారీగా విరాళాలు, వజ్రాలు విరాళంగా ప్రకటించారు.