Begin typing your search above and press return to search.

ముద్రగడ చేసిన ఆ ఆరోపణల్లో ‘నిజం’ ఎంత?

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:42 AM GMT
ముద్రగడ చేసిన ఆ ఆరోపణల్లో ‘నిజం’ ఎంత?
X
కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్ ఈ రోజుకు ఈ రోజు పుట్టుకొచ్చిందేమీ కాదు. దశాబ్దాల తరబడి ఉన్న ఈ నినాదం ఇప్పుడు ఉద్యమ రూపంలోకి రావటం.. కాపుగర్జన పేరిట ఒక చోట చేరిన లక్షలాది మందిలో కొందరు సంయమనం కోల్పోవటంతో కాపు గర్జన సమావేశం చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాపు గర్జనకు నేతృత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తించినట్లున్నారు. అందుకే.. ఆయన జరిగిన రచ్చకు ప్రభుత్వమే కారణమన్న ఆరోపణల్ని చేసేస్తున్నారు.

కాపు గర్జనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని.. ఆర్టీసీ.. స్కూల్ బస్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఉద్యమం సందర్భంగా వంట చేసుకోవటానికి కూడా స్థలం కేటాయించకుండా.. విద్యుత్తు సరఫరా లేకుండా ఇబ్బంది పెట్టినట్లుగా విమర్శిస్తున్నారు. ఏపీలో 28శాతం ఉన్న కాపు ఓటు బ్యాంకును కొల్లగొట్టటం కోసం ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపుల్ని బీసీల్లోకి చేరుస్తానంటూ హామీ ఇచ్చారని.. ఇప్పటివరకూ దాన్నినిలబెట్టుకోలేదని ఆయన మండిపడుతున్నారు.

మరి.. ముద్రగడ పద్మనాభం మాటల్లో నిజం ఎంతన్నది చూస్తే.. కాపుల్ని బీసీల్లో చేర్చే విషయంలో బాబు తనకు తానుగా హామీ ఇవ్వటం సార్వత్రిక ఎన్నికల్లో అందరూ చూసింది. అయితే.. తాను ఇచ్చిన చాలా హామీల మాదిరే కాపుల రిజర్వేషన్ విషయంలోనూ తర్వాత చూద్దామంటూ ‘వాయిదా’ వేసిన దానికి బాబు సర్కారు భారీ మూల్యాన్నే చెల్లించక తప్పలేదు.

ఇదిలా ఉంటే.. ముద్రగడ పద్మనాభం ఆరోపించినట్లుగా కాపుగర్జనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందనటంలోనూ వాస్తవం లేదనిపించక మానదు. కాపుగర్జన పట్ల.. దాని తీవ్రత పట్ల ప్రభుత్వం ఏమాత్రం స్మెల్ చేసినా.. నిన్నచోటుచేసుకున్న పరిణామాలు అస్సలు జరిగేవే కాదు.

నిజంగానే కాపు గర్జనకు ప్రభుత్వం అడ్డుపడాలని భావిస్తే.. తుని బహిరంగ సభకు లక్ష (1.50లక్షలు అని కూడా కొందరు చెబుతున్నారు) మంది ఒక చోట చేరకుండా పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు తీసుకునేది. తునికి చేరకుండానే ఆందోళనకారుల్ని అడ్డుకునే వీలుంటేది.ముద్రగడ పద్మనాభాన్ని ఇంటికే పరిమితం చేసి ఉండేవారు. ఇవేమీ జరగలేదంటే.. కాపు ఐక్యగర్జన విషయంలో ముద్రగడ చెబుతున్న మాటల్లో నిజం లేదని చెప్పక తప్పదు.

ఈ మొత్తం వ్యవహారాన్ని సింఫుల్ గా చెప్పాలంటే.. హామీ ఇవ్వగానే సరికాదు.. దాన్ని సకాలంలో పూర్తి చేయాలన్న విషయాన్ని బాబు సర్కారు మర్చిపోయి తప్పు చేస్తే.. దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కరోజులో.. హింసాత్మకంగా అయినా సరే సమస్యను పరిష్కరించుకోవాలన్న భావనకు ముద్రగడ రావటం మరింత పెద్ద తప్పుగా చెప్పక తప్పదు. కాపు ఐక్య గర్జనను ఒక ప్రభుత్వం అడ్డుకోవాలని నిజంగా భావించి ఉంటే సభ జరిగేదా అన్నది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. దీనిపై ఎవరేం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు.