Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ క్లీన్ అనిపించుకునేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతున్న‌ కేటీఆర్

By:  Tupaki Desk   |   28 April 2022 4:30 PM GMT
మిస్ట‌ర్ క్లీన్ అనిపించుకునేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతున్న‌ కేటీఆర్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ పార్టీలో ప్ర‌భుత్వంలో పట్టు పెంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గులాబీ ద‌ళ‌ప‌తి కుటుంబ స‌భ్యులైన కూతురు క‌విత‌, మేన‌ల్లుడు హ‌రీశ్ రావు, ద‌గ్గ‌రి బందువు సంతోష్ రావు కంటే కేటీఆర్ త‌న త‌ర్వాతి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తార‌నే సిగ్న‌ల్స్ ఇప్ప‌టికే కేసీఆర్ ఎంతో స్ప‌ష్టంగా ఇచ్చేశారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వితోనే ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చేశారు. కీల‌క‌మైన ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క శాఖ‌లు కేటాయించారు. అయితే, మంత్రిగా మిస్ట‌ర్ క్లీన్ ఇమేజ్ తెచ్చుకునేందుకు కేటీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. కానీ ఇది ఆశించిన స్థాయిలో లేద‌ని చెప్తున్నారు.

తాజాగా టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీన‌రీ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ మేర‌కు కేటీఆర్ గురించి చ‌ర్చ‌ తెర‌మీద‌కు వ‌స్తోంది. బుధ‌వారం నిర్వ‌హించిన టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సిటీలో ఎక్కడ చూసినా ఆ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో హైదరాబాద్ గులాబీమయం అయింది. ప్లీనరీ కోసం కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్కు అడ్డగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ ట్విట్టర్ ఖాతాకు వస్తున్న ఫిర్యాదులకు మాత్రమే అధికారులు ఫైన్లు వేస్తున్నారు.

దీంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. మ‌రోవైపు ప్లీనరీ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు. రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు ఎలా పెడుతారని పాల్ ప్రశ్నించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని.. ఇప్పుడు ఎందుకు రూల్స్ ని బ్రేక్ చేశారని కేఏ పాల్ ప్రశ్నించారు.

ఇలా ఇటు సాధార‌ణ ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్లో , ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించి మ‌రి టీఆర్ఎస్ పార్టీ తీరును, ప్ర‌భుత్వం వైఖ‌రిని ప్ర‌శ్నించిన నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ సార‌థ్యంలోని పుర‌పాల‌క శాఖ అధికారులు రెస్పాండ్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు భారీగా ఫైన్లు వేశారు.

అత్యధికంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ.2 లక్షలకు పైగా ఫైన్ వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. లక్షకు పైగా, మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు రూ.50 వేలకు పైగా ఫైన్లు వేశారు. మొత్తం ప్లీనరీకి సంబంధించి రూ.10 లక్షలకు పైనే జరిమానాలు విధించారు.

రెండు రోజుల్లో ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ట్విట్టర్ లో వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే, జనం నుంచి వచ్చిన ఫిర్యాదులకు మాత్రమే ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు ఫైన్లు విధించారు. నేరుగా వేసిన ఫైన్ లు పదుల సంఖ్యలో కూడా లేవు. దీంతో మిస్ట‌ర్ క్లీన్ ఇమేజ్ కోసం కేటీఆర్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ... అది వాస్తవంగా ఊహించిన స్థాయిలో లేదంటున్నారు.