Begin typing your search above and press return to search.

జగనా? మజాకా? రఘురామకు ఢిల్లీలో షాక్?

By:  Tupaki Desk   |   27 Jun 2020 6:45 AM GMT
జగనా? మజాకా? రఘురామకు ఢిల్లీలో షాక్?
X
ఉట్టికే ఎగరలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేసిందట వెనుకటికి ఒకామె.. ఇప్పుడు అలానే ఉందట వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పరిస్థితి. నిన్నా మొన్నటిదాకా.. వైసీపీని, సీఎం జగన్ ని, ఎంపీ విజయసాయిరెడ్డిని ఏమాత్రం లెక్కచేయకుండా విమర్శలు చేశారాయన.. తనకు కేంద్ర బలగాలతో వైసీపీ నుంచి రక్షణ కల్పించాలన్నారు. వైసీపీ షోకాజ్ నోటీస్ జారీ చేశాక ఢిల్లీలోనే తేల్చుకుందామని.. తనకున్న పరపతితో వైసీపీని ఇరుకుపెడుదామని బయలు దేరారు. కానీ ఢిల్లీలో చక్రం తిప్పిన సీఎం జగన్ ధాటికి ఇప్పుడు ఎవరూ స్పందించకపోవడంతో యూటర్న్ తీసుకున్నారు. జగన్ అంటే గౌరవం ఉందని.. తాను షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తానని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారట..

లోక్ సభలో వైసీపీ నాలుగో అతిపెద్ద పార్టీ. రాజ్యసభలో 6వ అతిపెద్ద పార్టీ. వైసీపీతో బీజేపీ పెద్దలకు చాలా పని ఉంది. అందుకే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించారు. వైసీపీపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన రఘురామకృష్ణం రాజు కూ ఎవరూ పెద్దగా స్పందించకుండా ఊరట దక్కకుండా చక్రం తిప్పారట..

దీంతో వైసీపీతో వ్యవహారాన్ని కేంద్రంతోనే తేల్చుకుంటానని బీరాలు పలికి ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణం రాజుకు అక్కడి వెళ్లాక పరిస్థితి అర్థమైందట.. జగన్ పై ఫిర్యాదు కోసం వచ్చారని తెలియగానే పార్లమెంట్ స్పీకర్ తోపాటు మిగతా కేంద్రమంత్రులు కూడా మొక్కుబడిగా స్పందించారు.

దెబ్బకు దేవుడు దిగివచ్చిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు యూటర్న్ తీసుకున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. జగన్ అంటే తనకు గౌరవమని.. విజయ సాయిరెడ్డే అంతా చేశాడని నెప్పాన్ని సాయిరెడ్డిపై మోపి మాట మార్చేశాడు. వైసీపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తానని తెలిపారు.

ఇలా జగన్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ వెళ్లిన రఘురామక ఆశాభంగం కలిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పరిస్థితి చూశాక ఆయనకు అసలు అర్థమయ్యిందంటున్నారు. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్న జగన్ కు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు, ఇతర నేతలు స్పందించకపోవడం.. రఘురామకు అండగా నిలవకపోవడంతో రఘురామకృష్ణం రాజుకు అసలు తత్త్వం బోధపడినట్టు తెలుస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.