Begin typing your search above and press return to search.

బాబు గాలి తీసేసే కామెంట్లు చేసిన జేసీ

By:  Tupaki Desk   |   28 Jun 2018 4:48 PM GMT
బాబు గాలి తీసేసే కామెంట్లు చేసిన జేసీ
X
ఏపీ రాజకీయాల్లో మిగ‌తావారంద‌రి కంటే...అధికార పార్టీని ఇర‌కాటంలో పెట్టే వ్య‌క్తి ఎవ‌రంటే..టీడీపీ నేత‌లు కూడా ఏ మాత్రం త‌డుముకోకుండా చెప్పే పేరు జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈ సీనియ‌ర్ నేత చేసే సంచ‌ల‌న కామెంట్ల గురించి తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి జేసీ శైలి. ప్రస్తుతం టీడీపీలో ఎంపీగా కొనసాగుతున్నప్ప‌టికీ జేసీ అదే దూకుడును కొన‌సాగిస్తున్నారు. సాధార‌ణంగా ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటిది చెల్ల‌దు. కానీ జేసీ కి మాత్రం చెల్లింది. తాజాగా కడప ఉక్కు ఫ్యాక్ట‌రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

క‌డ‌ప‌ ఉక్కు ప్లాంట్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని ఆరోప‌ణ‌లు రావ‌డంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహార దీక్ష మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. సీఎం ర‌మేశ్ దీక్షకు మ‌ద్ద‌తుగా ఢిల్లీలో ఒత్తిడి పెంచాల‌ని భావిస్తున్న టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ ను కలిశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీక్ష చేస్తే ఉక్కు..తుక్కు ఏం రాదని పేర్కొంటూ ఈ విష‌యం త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇదే అంశాన్ని సీఎం ర‌మేష్‌తో కూడా తాను చ‌ర్చించాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప‌రిశ్ర‌మ రాక‌పోవ‌డానికి సాంకేతిక కార‌ణాలు ఉన్నాయ‌ని జేసీ వివ‌రించారు. `ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం ప్రస్తుతం మూడువేల ఎకరాలు అందుబాటులో ఉంది. మెకాన్ 18వందల ఎకరాలు కావాలని అని అడిగింది. ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో 500 ఎకరాల ప్రైవేట్ భూమి కావాలంటున్నారు. ఎకరానికి రూ. 4 లక్షలు ఇస్తామని - 16కి.మీ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం వెల్ల‌డించి ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాం. అయినా మేం విజయం సాధించలేదు` అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా రాద‌ని కూడా జేసీ జోస్యం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా...గ‌తంలో సైతం దీక్ష విష‌యంలో జేసీ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీక్షలో నిజాయితీ లేదని - మందులతో సాగుచేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.దివంగత పొట్టి శ్రీరాములు స్థితికి దీక్ష చేస్తున్న రమేష్‌ వెళ్లినా.. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ఈ ప్రాంతానికి ఉక్కు కర్మాగారం రాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా `కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం ఏపీ ప్రజల ఖర్మ. చంద్రబాబు ఏం తక్కువవాడు కాదు.. నాటకాలడటం - డ్రామాలు ఆడించడం - మాటలు చెప్పడం - కుయుక్తులు పన్నడం అన్నీ తెలుసు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు`` అని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.