Begin typing your search above and press return to search.

సంక్షోభానికి మూలపురుషుడే డిగ్గీరాజా.. ఇప్పుడు రాజీ ప్రయత్నాలా?

By:  Tupaki Desk   |   18 March 2020 7:45 AM GMT
సంక్షోభానికి మూలపురుషుడే డిగ్గీరాజా.. ఇప్పుడు రాజీ ప్రయత్నాలా?
X
పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి.. తన వ్యక్తిగత అజెండా.. తన ఇగో కోసం పట్టుదలతో పార్టీలోని విబేధాలకు ఆజ్యం పోసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే సంక్షోభంలోకి నెట్టిన వ్యక్తి ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని గాడీన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మేరకు బెంగళూరుకు వెళ్లి హోటల్, రిసార్ట్ లో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వచ్చేయండి.. మీకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతూ వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాడని సమాచారం. ఆ వ్యక్తినే దిగ్విజయ్ సింగ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభానికి కారణమని అందరూ భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో సమష్టిగా పని చేయడంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి చేరువయ్యింది. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరగ్గా అసలు కష్టపడిన వ్యక్తిని కాకుండా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వృద్ధ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి పీఠంపై ఆశ పడిన వ్యక్తి ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కలేదు. కనీసం గౌరవం కూడా ఇవ్వకపోవడంతో పార్టీలో చీలిక వచ్చింది. పార్టీలో ఏర్పడిన వర్గ విబేధాలు ప్రభుత్వంలోనూ కనిపించాయి. తాజాగా జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి బైబై చెప్పేసి తన వర్గ ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయాడు. దీంతో ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. బెంగళూరులో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే వారిని కలవడానికి దిగ్విజయ్ సింగ్ బెంగళూరు వెళ్లారు. 21మంది రెబల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ప్రస్తుతం డిగ్గీ రాజ అధిష్టానం ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు. బెంగళూరులోని రమాడ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివ కుమార్‌ తో కలిసి దిగ్విజయ్ సింగ్ ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్‌ కు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి అనుమతి లేదంటూ వారిని బయటే ఆపేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వారు హోటల్‌ బయట ధర్నాకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే దిగ్విజయ్ సింగ్ తీరును సొంత పార్టీ నాయకులే తప్పుబడుతున్నారు. జ్యోతిరాదిత్యకు ఇన్నాళ్లు వేధించి.. ప్రాధాన్యం ఇవ్వకుండా చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తీవ్ర సంక్షోభానికి ముఖ్య కారణమైన వ్యక్తి మళ్లీ ఆ సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేస్తామంటే ఎలా కుదిరేది? అని జ్యోతిరాదిత్య సింధియా వర్గం ప్రశ్నిస్తోంది. పార్టీలో ఉన్నన్నాళ్లు తీవ్రంగా వేధించి ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తామని రెబల్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారంట. డిగ్గీరాజ తీరుతోను తాము బయటకు వచ్చామని పేర్కొంటున్నారంట.