Begin typing your search above and press return to search.

దేశ రాజకీయాలను మలుపుతిప్పిన బలపరీక్షలివి..

By:  Tupaki Desk   |   19 May 2018 3:30 PM GMT
దేశ రాజకీయాలను మలుపుతిప్పిన బలపరీక్షలివి..
X
విశ్వాస పరీక్ష.. బల పరీక్ష.. పేరేదైనా కానీ, దేశ రాజకీయాల్లో ఇది ఎప్పుడూ పార్టీలకు, ప్రభుత్వాధినేతలకు టెన్షన్ టాపిక్కే. తాజాగా కర్ణాటకలో విశ్వాస పరీక్షలో గెలవలేక బీజేపీ నేత యడ్యూరప్ప ఆ పరీక్షను ఎదుర్కోకముందే రాజీనామా చేశారు. అయితే.. రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ పలుమార్లు ఈ బలపరీక్షలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. అలాంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం.

- దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన దాదాపు రెండేళ్ల తర్వాత ప్రతిపక్షాల ప్రభావం పెరిగినట్లు గమనించిన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, లోక్ సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేశారు. అత్యవసర పరిస్థితి విధించాలనే నిర్ణయం కాంగ్రెస్‌కు ఎన్నికల్లో చాలా నష్టం కలిగించింది. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. జనతా పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి అయ్యారు. చరణ్ సింగ్ ఆ ప్రభుత్వంలో హోంమంత్రి, ఉప ప్రధాని అయ్యారు. పార్టీలో అంతర్గత కలహాలతో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ - సీపీఐ మద్దతుతో చరణ్ సింగ్ 1979 జులై 28న ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. బలం నిరూపించుకోడానికి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆయనకు ఆగస్టు 20 వరకు గడువు ఇచ్చారు. కానీ ఒక రోజు ముందే అంటే ఆగస్టు 19న ఇందిరాగాంధీ తన మద్దతు వెనక్కు తీసుకున్నారు. దాంతో ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు.

- ఇలాంటిదే 1989లో జరిగింది. 1988లో జయ ప్రకాశ్ నారాయణ్ జన్మదినం అక్టోబర్ 11న జనమోర్చా, జనతా పార్టీ, లోక్ దళ్, కాంగ్రెస్(ఎస్) విలీనం అయ్యాయి. కొత్త పార్టీ జనతాదళ్ ఆవిర్భవించింది.వీపీ సింగ్‌ను జనతా దళ్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఆయన నేతృత్వంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుకు కిందకు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. 1989లో ఎన్నికలు జరిగాయి. నేషనల్ ఫ్రంట్‌ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బీజేపీ, వామ పక్షాలు బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఏడాది తర్వాత బీజేపీ రథయాత్ర ప్రారంభించింది. రథం చాలా రాష్ట్రాల నుంచి వెళ్తూ బీహార్ చేరుకుంది. బీహార్‌లో జనతా దళ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అద్వానీ రథ యాత్రను అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయించారు. దాంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో వీపీ సింగ్ సర్కారు కూలిపోయింది.

- వీపీ సింగ్ రాజీనామా తర్వాత జనతాదళ్ నేత చంద్రశేఖర్, తన మద్దతుదారులతో పార్టీని వీడారు. సమాజ్ వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగాయి, ఆయన పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. లోక్‌సభలో జరిగిన ఫ్లోర్‌ టెస్ట్‌లో కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇచ్చింది. చంద్రశేఖర్ ప్రధాన మంత్రి అయ్యారు. సుమారు ఏడు నెలల తర్వాత ఒక ఘటన చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా ఇచ్చేలా చేసింది. 1991 మార్చి 2న హర్యానా పోలీస్ కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, రాజ్ సింగ్ రాజీవ్ గాంధీ నివాసం 10 జన్ పథ్ బయట నిఘా పెట్టారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఇద్దరూ మఫ్టీలో ఉన్నారు, కొంత సమాచారం సేకరించడానికి తమను పంపించారని అరెస్ట్ తర్వాత వారిద్దరూ అంగీకరించారు. ఈ విషయంపై రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంటులో విశ్వాస పరీక్ష నిర్వహించవలసి వచ్చింది. ఫ్లోర్ టెస్ట్‌ జరగడానికి ముందే చంద్రశేఖర్ 1991 మార్చి 6న ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

- 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ జనతా పార్టీ నుంచి విడిపోయి, సమాజ్ వాదీ పార్టీ స్థాపించారు. ఒక ఏడాది తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో బాబ్రీ మసీదును కూల్చివేశారు.దీంతో కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. సమాజ్ వాదీ పార్టీ, మాయావతి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండలేకపోయింది. బీఎస్‌పీ తన మద్దతు వెనక్కు తీసుకుంది, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. తాము మోసపోయామని భావించిన సమాజ్ వాదీ పార్టీ అధికారానికి దూరమైంది.

- 1998లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆధిక్యం దక్కలేదు. కానీ అన్నాడీఎంకే మద్దతుతో ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.13 నెలల తర్వాత అన్నాడీఎంకే తన మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విపక్షాల డిమాండ్‌ తో రాష్ట్రపతి ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. లోక్‌సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. ఎన్డీయే సర్కారు ఓడిపోవడానికి కారణమైన ఓటును అప్పటి ఒడిశా సీఎం గిరిధర్ గమాంగ్‌ వేశారు. గమాంగ్ ఆ సమయంలో ఒడిశా ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు ఎంపీగా ఉన్నారు.