Begin typing your search above and press return to search.

కేసీఆర్ కలల సచివాలయంలో మసీదు డిజైన్ ఇదే

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:31 AM GMT
కేసీఆర్ కలల సచివాలయంలో మసీదు డిజైన్ ఇదే
X
తాను అనుకున్నంతనే కొండ మీద కోతి అయినా దిగి రావాలన్న పట్టుదల.. అంతకు మించిన మొండితనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. దాని కారణంగా మంచి జరగపోలేదు. అదే సమయంలో.. అదే తీరు కొన్నిసార్లు విమర్శలకు తావిచ్చింది. తాను కోరుకున్న సచివాలయాన్ని నిర్మించేందుకు.. ఇప్పుడున్న సచివాలయాన్ని తీయించి..కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సచివాలయాన్ని కూల్చి వేసిన సమయంలోనే ఆవరణలో ఉన్న గుడిని.. మసీదును కూడా తీసేశారు. మసీదును తీసివేయటంపై మజ్లిస్ అధినేత అసద్ ఆగ్రహం వ్యక్తం చేయటం.. అనంతరం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెనక్కి తగ్గటం తెలిసిందే.

కేసీఆర్ కలల సౌథంగా అభివర్ణించే సచివాలయంలో చక్కటి మసీదును ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటకు తగ్గట్లే.. తాజాగా దీని నిర్మాణ డిజైన్ ను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. మసీదు నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఇష్టాయిష్టాల్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే సచివాలయంలో నిర్మిస్తున్న మసీదు డిజైన్ టర్కీలోని మసీదును పోలి ఉండటం గమనార్హం. ఈ డిజైన్ కు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. ఈ నెలలోనే మసీదు నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. పాత సచివాలయంలో మసీదు ఉన్నచోటనే.. తాజా మసీదును నిర్మించనున్నారు.

సచివాలయంలో నిర్మిస్తున్న టర్కీ డిజైన్ మసీదును 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద మసీదు.. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిన్న మసీదును నిర్మిస్తారు. తాజాగా నిర్మిస్తున్న పెద్ద మసీదు లోపలి ప్రాంగణంలో 400 మంది.. మసీదు ఆవరణలో వెయ్యి మంది ప్రార్థనలు చేసుకునే వీలుంది. ఈ నిర్మాణాన్ని ఏడాదిలోపు పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. మసీదుతో పాటు దేవాలయాన్ని కూడా నిర్మించాల్సి ఉంది. మరి.. దాని డిజైన్ ను ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.