Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం?

By:  Tupaki Desk   |   29 May 2020 4:30 PM GMT
లాక్ డౌన్ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం?
X
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ 4.0 గడువు మే 31తో ముగియనుండడంతో లాక్ డౌన్ 5.0పై చర్చ జరుగుతోంది. మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తూ లాక్ డౌన్ 5.0 విధించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూనే లాక్‌డౌన్‌ 5.0ను ప్రధాని ప్రకటించవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలపైనే లాక్‌డౌన్‌ 5.0 ప్రధానగంగా దృష్టిసారిస్తుందని తెలుస్తోంది. ఢిల్లీ మెట్రో సహా, మాల్స్, రెస్టారెంట్లు మరిన్ని మార్కెట్లు తెరుచుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జూన్‌ 1 నుంచి మొదలయ్యే అవకాశం ఉన్న లాక్‌డౌన్‌ 5.0లో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌, పుణే, థానే, ఇండోర్‌, చెన్నై, అహ్మదాబాద్‌, జైపూర్‌, సూరత్‌, కోల్‌కతా నగరాల్లో కరోనా కట్టడిపై కేంద్రం ఫోకస్‌ చేయనుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్‌, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదయ్యాయి. దీంతో, ఈ నగరాల్లో మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో కూడిన జాబితాను కేంద్రం సిద్ధం చేసిందని తెలుస్తోంది.

కాగా, నాలుగు లాక్ డౌన్ లలో మూసి ఉన్న ప్రార్థనా స్థలాలకూ లాక్‌డౌన్‌ 5.0లో సడలింపు లభించనుందని తెలుస్తోంది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకునేందుకు కేంద్రం ప్రతిపాదనలు, నిబంధనలు సిద్ధం చేస్తోందట. అయితే, ప్రార్థనా స్ధలాల్లో భారీగా ప్రజలు గుమికూడటం నిషేధం. కోవిడ్‌-19 నిబంధనలను, జాగ్రత్తలను పాటిస్తూ వీటిని అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రార్థనా స్ధలాల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్, ఆరోగ్య సేతు యాప్ వినియోగం వంటివి తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే, జూన్‌ 1 నుంచి అన్ని ప్రార్ధనా స్ధలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

లాక్‌డౌన్‌ 4.0లో సెలూన్లకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా జిమ్‌లను తెరిచేందుకు అనుమతించనున్నట్లు సమాచారం . కంటెయిన్మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో జిమ్‌లను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాసంస్థలపై మాత్రం సడలింపులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. లాక్ డౌన్ 5.0లో రాష్ట్ర ప్రభుత్వాలే నిబంధనలు విధించేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. అయితే, కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు, సడలింపులను నీరుగార్చకుండా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో షా ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల సీఎంలు తమ ప్రాంతాల్లోని కేసుల తీవ్రత, సడలింపులపై వారు చర్చించారు. ఏది ఏమైనా...లాక్ డౌన్ 5.0లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశముందని చెప్పవచ్చు.