Begin typing your search above and press return to search.

ఐరాస చేదువార్త: మహమ్మారితో మరిన్ని ఆకలిచావులు

By:  Tupaki Desk   |   14 July 2020 11:30 AM GMT
ఐరాస చేదువార్త: మహమ్మారితో మరిన్ని ఆకలిచావులు
X
మహమ్మారి వైరస్ కారణంగా మరిన్ని ఆకలి చావులు ఉంటాయని.. పేదరికం తీవ్రంగా పెరుగుతుందని తెలిసింది. ఈ సందర్భంగా ఐక్య రాజ్య సమితి మానవ ప్రపంచానికి మరో చేదు వార్త తెలిపింది. ఈ ఏడాది మరింత మంది పస్తుల్లోకి జారుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా 'ఆహార భద్రత, పోషణ పరిస్థితి- 2020' నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు ప్రపంచ దేశాలను ఐరాస అప్రమత్తం చేసింది.

2019లో దాదాపు 69 కోట్ల మందికి పైగా ప్రజలు పస్తులతో గడిపారని.. 2018తో పోల్చుకుంటే కోటి మందికి పైగా, ఐదేళ్లతో పోల్చుకుంటే 6 కోట్లకు పైగా ప్రజలు ఆకలితో గడిపినట్టు విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచ ఆహార భద్రత, పోషణ పరిస్థితి నివేదిక మరో బాధాకరమైన సందేశాన్ని మోసుకొచ్చిందని ఆ నివేదికలో ఐక్య రాజ్య సమితి పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్-19 కారణంగా ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని తెలిపింది. ఈ ఏడాది ఇంకా అనేకమంది పస్తుల్లోకి జారుకునే ప్రమాదం ఉందని ఐరాస చీఫ్ గుటెరస్ పేర్కొన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఆకలి లేని ప్రపంచంగా అవతరించాలన్న లక్ష్యం నెరవేరదని ఈ సందర్భంగా గుటెరస్ గుర్తుచేశారు. ‘‘పరివర్తన ఇప్పుడే ఆరంభం కావాలి. మరింత స్థిరమైన, సంఘటిత ప్రపంచం దిశగా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలంటే కొవిడ్-19 నిర్మూలన కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం, ప్రపంచం కోసం ఆహార వ్యవస్థలను మరింత స్థిరంగా, స్థితిస్థాపకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది..’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఆహార వ్యవస్థల సమ్మేళనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ విధంగా ఐక్య రాజ్య సమితి ఆందోళనకర విషయం వెల్లడించింది. మహమ్మారి వైరస్ వ్యాప్తి ఎంతటి ప్రభావం చూపుతుందో తాజా నివేదికతో స్పష్టంగా అర్ధమవుతోంది.