Begin typing your search above and press return to search.

కేర‌ళ‌లో మంకీ పాక్స్, బెంగాల్ లో బ్లాక్ ఫీవ‌ర్.. ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   17 July 2022 5:30 AM GMT
కేర‌ళ‌లో మంకీ పాక్స్, బెంగాల్ లో బ్లాక్ ఫీవ‌ర్.. ఏం జ‌రుగుతోంది?
X
ఇప్ప‌టికే కోవిడ్ దేశాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గ‌త రెండేళ్ల‌లో ల‌క్ష‌లాది మంది భార‌తీయులు కోవిడ్ బారిన‌ప‌డ్డారు. ల‌క్ష మందికిపైగా కోవిడ్ తో మృతి చెందారు. కోవిడ్ దుష్ప్ర‌భావాల‌తో ఇప్ప‌టికే చాలామంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడిప్పుడే కోవిడ్ క‌ల్లోలం నుంచి కోలుకుంటున్నారు. ఇంత‌లోనే పులిమీద పుట్ర‌లా మ‌రో రెండు దేశంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

కేర‌ళ‌లో మంకీ పాక్స్. బెంగాల్ లో బ్లాక్ ఫీవ‌ర్ కేసులు వెలుగు చూడ‌టం అంద‌రిలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్పటికే 64 దేశాలలో 9,200కి పైగా మంకీ పాక్స్ కేసుల గుర్తించినట్లు ప్ర‌పంచ‌ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్ర‌జ‌లంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తాజాగా.. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు కేర‌ళ‌లోని కొల్లం జిల్లాలో నమోదైన సంగ‌తి తెలిసిందే. అమెరికా నుంచి ఇటీవల కేరళకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. దేశంలో మంకీ పాక్స్ తొలికేసు నమోదు కావడంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా జారీ చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో మంకీ పాక్స్ టెస్టుల‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది.

పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో అల్లాడుతున్నారు. ఆ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు నమోదు అయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదు కావడంతో బ్లాక్ ఫీవర్ పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా పరాన్నజీవి లీష్మానియా డోనోవానీ సోకిన సాండ్ ఈగలు (sandflies) కాటు ద్వారా వ్యాపిస్తాయ‌ని అంటున్నారు.

బ్లాక్ ఫీవర్ ఫియర్ పరిణామాలతో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా ఖ‌ర్చు భరిస్తామని రాష్ట్ర యంత్రాంగం స్పష్టం చేసింది.