Begin typing your search above and press return to search.

'మ‌నీ మ‌ర్డ‌ర్‌'.. 279 మందిని బ‌తికుండానే చంపేశాడు.. ఇదో విచిత్రమైన ఇన్సిడెంట్‌!!

By:  Tupaki Desk   |   17 Nov 2022 11:30 PM GMT
మ‌నీ మ‌ర్డ‌ర్‌.. 279 మందిని బ‌తికుండానే చంపేశాడు.. ఇదో విచిత్రమైన ఇన్సిడెంట్‌!!
X
'డ‌బ్బు కోసం గ‌డ్డి తిన్నాడు'-అనేది సామెత‌. కానీ, దీనిని ఓ వ్య‌క్తి నిజం చేసి చూపించాడు. నిజంగా అత‌ను గ‌డ్డి తిన‌లేదు కానీ, అంత ప‌నీ చేశాడు. బ‌తికి ఉన్న‌వారిని.. చ‌నిపోయారంటూ.. ఏకంగా ప్ర‌భుత్వం నుంచి కోట్ల రూపాయ‌లు కొట్టేశాడు. ఇప్పుడు ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఏకంగా.. కేంద్ర‌మే దీనిపై దృష్టి పెట్టి.. స‌ద‌రు సొమ్మును రిక‌వ‌రీ చేసుకునే ప‌నిలో ప‌డింది.

ఏం జ‌రిగిందంటే..గుజరాత్లో ఓ వ్యక్తి 279 మంది చ‌చ్చిపోయారంటూ..నకిలీ ప‌త్రాలు పుట్టించారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వాలు ఇచ్చే ప‌రిహారం కింద‌..ఏకంగా 11 కోట్ల 26 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పోగేసుకున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల సొమ్మే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ తతంగం ఒక్క‌రోజో రెండు రోజుల్లో చేసింది కాదు.. ఏళ్ల‌కు ఏళ్లుగా అత‌ను సాగించిన 'మ‌నీ మ‌ర్డ‌ర్స్‌'

గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇత‌ర రాష్ట్రాల మాదిరిగానే ప్ర‌మాదవ శాత్తు మృతి చెందిన వ్య‌క్తుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేస్తుంటుంది. దీనికి కేంద్రం కూడా ప్ర‌కృతి విప‌త్తుల పేరుతో ఆర్థికంగా సాయం అందిస్తుంది. ఇలా.. నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు, పాముకాటు లేదా ఇతర కారణాల వల్ల ఏ వ్యక్తి అయినా మరణిస్తే.. రెవెన్యూ శాఖలోని రిలీఫ్ బ్రాంచ్.. బాధిత కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంది.

దీనిని అదునుగా తీసుకున్న గుజ‌రాత్‌లోని సూరత్ జిల్లాకు సమీపంలో తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న సచిన్ అనే క్ల‌ర్క్‌.. బతికున్న వ్యక్తులు చనిపోయారని నకిలీ వివరాలు అప్లోడ్ చేసి.. కొత్త స్కామ్కు తెరతీశాడు. ఏకంగా 279 మంది చనిపోయినట్లు నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. మొత్తం 40 బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.11.26 కోట్లు ప్ర‌భుత్వ ప‌రిహార సొమ్మును స్వాహా చేశాడు. దీనిలో కేంద్రం ఇచ్చిన న‌గ‌దు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎలా బయటపడిందంటే..ఆఫీసులో కొన్ని అవకతవకలు జరిగినట్లు అనుమానాలు రాగా.. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడిట్ నిర్వహించింది. అప్పటి నుంచి సచిన్ ఆఫీసుకు రావటం మానేశాడు. దీంతో అతని అల్మారాలో వెతకగా నగదుకు సంబంధించిన కొన్ని ఆర్డర్ పత్రాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా.. అర్హత లేని వారి ఖాతాల్లో డబ్బులు జమ‌ అయినట్లు తెలిసింది. మొత్తం 40 ఖాతాలు గుర్తించగా.. అందులో కొన్ని అకౌంట్లలో రెండు, మూడుసార్లు నగదు జమా అయినట్లు తేలింది.

నిందితుడు ఎనిమిది వేర్వేరు బ్యాంకులకు చెందిన 40 ఖాతాల ద్వారా రూ.11.26 కోట్లు సంపాదించినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్‌లోని లెటర్‌హెడ్, సీల్, సంతకం అన్నీ నకిలీవేనని చెప్పారు. ప్రస్తుతం సచిన్కు సంబంధించిన ఇతర పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక‌, ఈ విష‌యంపై కేంద్రం కూడా అప్ర‌మ‌త్త‌మై.. కూపీ లాగుతోంది. చిత్రం ఏంటంటే.. క్ల‌ర్క్ స‌చిన్ దేశం వ‌దిలి వెళ్లిపోయాడు!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.