Begin typing your search above and press return to search.

మాజీమంత్రికి ,మోకా భాస్కరరావు హత్యకి సంబంధం ఏంటి ...ఆ వివాదమే కారణమైందా?

By:  Tupaki Desk   |   30 Jun 2020 2:00 PM GMT
మాజీమంత్రికి ,మోకా భాస్కరరావు హత్యకి సంబంధం ఏంటి ...ఆ వివాదమే కారణమైందా?
X
ఏపీ మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్యతో మచిలీపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భాస్కరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకోసం తన అనుచరుడు చింతా చిన్నితో హత్య చేయించారని భాస్కరరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వీరి మధ్య వివాదానికి కారణం ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది.

అసలు గొడవతోనే హత్య జరిగిందా...? హత్య చేసింది ఎవరు...? అనే ప్రశ్నలకు పోలీసుల విచారణలో తేలనుంది. గుమ్మటాల చెరువు విషయంలో భాస్కరరావు, మాజీమంత్రి కొల్లు రవీంద్రకు వివాదం ఉందని భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేశ్ కన్నా తెలిపారు. మత్స్యకార కుటుంబానికి చెందిన భాస్కరరావు.. తన అనుచరుల సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేవారు. ఇలా ఆయన రాజకీయంగా ఎదిగే క్రమంలో కొందరు ఓర్వలేరు అని రాజేశ్ చెబుతున్నారు.

ఇటు కులంలో సామాజికంగా, అటు బందరు మార్కెట్‌ యార్డు చైర్మన్ ‌గా రెండుసార్లు పనిచేయడం.. రాజకీయంగా ఎదగడంతో ఓర్వలేకే హత్య చేశారని ఆరోపించారు. గుమ్మటాల చెరువు విషయంలో అంతకుముందు కూడా ఘర్షణ జరిగిందని రాజేశ్ తెలిపారు. గతంలో తాను మంత్రిగా చేశాను.. గుర్తుంచుకో అని కొల్లు రవీంద్ర అన్నాడని చెప్పారు. నీ అంతుచూస్తానంటూ బెదిరించాడని.. చెప్పినట్టు అన్నంత పనిచేశాడని వాపోయాడు. తన బాబాయ్ భాస్కరరావు హత్య చేయించింది మాజీమంత్రి కొల్లు రవీంద్ర అని, ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని అన్నారు.

ఇకపోతే , మచిలీపట్నం మార్కెట్‌ లో హత్య జరిగిన తర్వాత ప్రధాన నిందితుడు పారిపోయి వచ్చాడు. అయితే అతనిని ఒకరు బుల్లెట్ ‌పై ఎక్కించుకొని వెళ్లారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుడేజీ పరిశీలించి.. ఏపీ 16వీఎల్ 6669 బుల్లెట్‌గా గుర్తించారు. అది చింతా చిన్నది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చింతా చిన్న స్వయంగా నిందితుడిని బుల్లెట్‌పై ఎక్కించుకొని వెళ్లి ఉండొచ్చని భావన వ్యక్తమవుతోంది. భాస్కరరావు హత్య ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు నాలుగైదు రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. హత్యలో నలుగురు పాల్గొన్నారని, వారి వయస్సు కూడా 18 నుంచి 22 ఏళ్లలోపు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు కత్తితో దాడి చేయగా.. మరో ఇద్దరు ప్రధాన రహదారి వద్ద బైకులతో వేచి ఉన్నారని సీసీ పుటేజీ ద్వారా తెలుస్తోంది.

మోకా భాస్కరరావు, అతని తండ్రి మోకా రామయ్య.. పేర్ని నాని కుటుంబానికి అండగా ఉంటున్నారు. నాని తండ్రి, మాజీమంత్రి పేర్ని కృష్ణమూర్తికి రామయ్య అనుచరుడిగా ఉన్నారు. రామయ్య కౌన్సిలర్‌గా పనిచేశాడు. తర్వాత భాస్కర్ రావు తన భార్యను కౌన్సిలర్‌గా గెలిపించుకున్నాడు. తన సామాజికవర్గం కోసం పాటుపడుతూ.. రాజకీయంగా ఎదుగుతున్న భాస్కర్‌రావుపై ప్రత్యర్థులు మట్టుబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.