Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తిగా పెద్దాయ‌న‌..రాంగ్ నంబ‌ర్ కాల్‌!

By:  Tupaki Desk   |   17 Jun 2017 6:05 AM GMT
రాష్ట్రప‌తిగా పెద్దాయ‌న‌..రాంగ్ నంబ‌ర్ కాల్‌!
X
దేశ ప్రథమ పౌరుడి ఎంపిక‌పై రాజ‌కీయ వ‌ర్గాల‌ దోబూచులాట కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన‌ప్ప‌టికీ ఇటు అధికార‌ప‌క్షం - అటు ప్ర‌తిప‌క్షం త‌మ అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌లేక‌పోతున్నాయి. ప‌ర‌స్ప‌ర చ‌ర్చ‌ల్లో మునిగితేలుతూ ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. అయితే ఎన్డీఏ మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన మాత్రం త‌న‌దైన శైలిలో ఆర్ ఎస్ ఎస్ ప్ర‌ముఖుడు మోహన్ భగవత్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా శివ‌సేన క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. కాగా, శివ‌సేన ప్ర‌క‌ట‌నపై రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రిప్లై ఇచ్చింది. భ‌గ‌వ‌త్ పేరును ప్ర‌స్తావించ‌డం ద్వారా శివసేన రాంగ్ నంబర్ కు డయల్ చేసిందని ఆర్ ఎస్ ఎస్ వ్యాఖ్యానించింది.

ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత కర్త రాకేష్ సిన్హా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ముందుగా మోహన్ భగవత్ పై శివసేనకు ఉన్న నమ్మకం - విశ్వాసానికి వారికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. అయతే మోహన్ భగవత్ వ్యక్తిత్వం, ఆయన సిద్ధాంతాలు పరిగణనలోనికి తీసుకుంటే ఆయన రాష్ట్రపతి అభ్యర్థికి సరైన ఎంపిక కాదని రాకేష్ సిన్హా అభిప్రాయపడ్డారు. భ‌గ‌వ‌త్ పేరును తేవ‌డం ద్వారా శివ‌సేన రాంగ్ నంబ‌ర్‌ కు డ‌య‌ల్ చేసిన‌ట్ల‌యింద‌ని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవతిని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ థాకరే ప్రతిపాదించారు. మోహన్‌ భగవతి దాన్ని ఖండించారు.

మ‌రోవైపు మోహన్‌ భగవత్‌ శుక్రవారం రాష్ట్రపతి భవన్‌ కు వెళ్లి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీతో విందు చేసి రావ‌డం తాజాగా చర్చనీయాంశమైంది. అయితే శివసేన అధినేత ఇదే శుక్రవారం మరోపేరు తెరమీదికి తెచ్చారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే నిర్ణయించాలని ఆయన ప్రతిపాదన పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ముందుకి కూడా ఆయన ఇదే ప్రతిపాదన తీసుకెళ్లారు. అంతమాత్రాన ఆయన మోహన్‌ భగవతి పేరుని ఉపసంహరించుకున్నట్టుగా భావించనక్కర్లేదు. భగవతి తనకు తానుగా రేసులో లేనని ప్రకటించుకున్నాక ఇక దానిమీద సస్పెన్సు లేనట్టే భావించాలి. అయితే కమలనాథుల మదిలో ఏముందో స్పష్టంగా తెలీడం లేదు. ముఖ్యంగా మోడీ-షా ద్వయమే దీనికి అంతిమ నిర్ణేతలు. భగవతి మాత్రం రాష్ట్రపతితో విందు చేయడంలో ప్రత్యేకించి విశేషమేమీలేదని అంటున్నారు. ఇది గతంలోనే నిర్ణయించిన కార్యక్రమమని, ప్రణబ్‌ ముఖర్జీ పదవీ విరమణ చేయబోతున్నందున గౌరవసూచకంగా ఆయన్ని కలవడం జరిగిందని, ఇందులో ఇంతకుమించి ప్రత్యేకత ఏమీ లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆయన పేరు ప్రతిపాదించినప్పటికీ ఆయన ముందుగా ప్రణబ్‌ని కలవాల్సిన అధికారిక ప్రొటోకాల్‌ ఏమీ లేదని గుర్తించాలని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/